మరికాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న మోడీ
ఢిల్లీ : ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రపతిని కలవనున్నారు. సాయంత్రం రామ్నాథ్ కోవింద్తో సమావేశమై రాజీనామా లేఖ అందజేసే అవకాశముంది. ప్రధానిగా మోడీ మరోసారి పగ్గాలు చేపట్టనున్నప్పటికీ సంప్రదాయం ప్రకారం ఆయన మంత్రివర్గాన్ని రద్దు చేసి రాష్ట్రపతికి రాజీనామా లేఖ అందజేయాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ కోవింద్ దాన్ని ఆమోదించిన అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ కార్యవర్గం సాయంత్రం భేటీ అయ్యే అవకాశముంది. కేబినెట్ రద్దుతో పాటు కొత్త మంత్రివర్గానికి సంబంధించి పార్టీ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ సైతం చివరిసారిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్జీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా.. ఇతరులు 97స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలిచిన మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా బీజేపీ విజయ దుందుభి మోగించడంతో మే 30న వరుసగా రెండోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.