నోట్ల రద్దు నిర్ణయం సరైందే..: మోడీని సమర్థించిన భార్య జశోదాబెన్
మోడీ నిర్ణయం సరైందేనని, పెద్ద నోట్లయిన రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధనం బహిర్గమవుతుందని అన్నారు.
ఉదయ్పూర్: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ సతీమణి జశోదాబెన్ ఆయనకు బాసటగా నిలిచారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన జశోదాబెన్.. తద్వారా నల్లధనం వెలికితీయడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు.
ఉపాధ్యాయురాలిగా రిటైర్డ్ అయిన జశోదాబెన్ బుధవారం నాడు రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఒక ప్రైవేటు స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్నారు. మోడీ నిర్ణయం సరైందేనని, పెద్ద నోట్లయిన రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధనం బహిర్గమవుతుందని అన్నారు.
కార్యక్రమంలో 'వందేమాతరం' ఆలాపనతో జశోదాబెన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ, మాయావతి, సుష్మాస్వరాజ్ లాంటి నేతలను మహిళలు ఆయా రంగాల్లో స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.
గ్యాస్ సబ్సిడీ విషయాన్ని కూడా జశోదాబెన్ ప్రస్తావించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్చందంగా వదులుకోవాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు మేలు జరిగిందన్నారు. చాలామంది ధనవంతులు స్వచ్చందంగా సబ్సిడీని వదులుకోవడంతో పేదలకు న్యాయం జరిగిందన్నారు. దీని ద్వారా దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడిందని చెప్పారు.