త్రిపురలో త్రిముఖ పోరు తప్పదా? మాణిక్ నిజాయితీని మోదీ హవా ఢీ కొంటుందా?
అగర్తల: పురాతన కాలం 'మాణిక్ సర్కార్'ను తోసిపడేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిపుర వాస్తవ్యులకు పిలుపునిచ్చారు. మాణిక్ సర్కార్ స్థానే హిరా (హెచ్- హైవేస్, ఐ - ఇంటర్నెట్, ఆర్ - రైల్వే, ఎ - విమానయానం)ను తెచ్చుకోండని కూడా భావోద్వేగ భరిత ప్రసంగంతో త్రిపుర వాసులను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. మోడీ విత్ ట్రిపుర అనే యాష్ ట్యాగ్తో రోజంతా ట్వీట్ల వర్షం కురిపించిన ప్రధాని మోదీ.. మాణిక్ సర్కార్ సారథ్యంలోని సీపీఎం ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరినట్లు కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం త్రిపుర అసెంబ్లీకి పోలింగ్ జరుగనున్నది. 1993 నుంచి త్రిపురలో సీపీఎం అధికారంలో ఉన్నది. 1998 నుంచి మాణిక్ సర్కార్ సీఎంగా ఉన్నారు.
ఈశాన్య భారతంలో వామపక్ష పార్టీలపై బీజేపీ పై చేయి సాధించిందనడానికి ఏడు కారణాలు ఉన్నాయి.ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, కొడిగట్టిపోతున్న లెఫ్ట్ ప్రాభవం, ఈశాన్య భారతంలో నూతన కూటములు కడుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే త్రిపురలో సాదాసీదాగా ఉంటూ ప్రజలకు దగ్గర కావడంలో మాణిక్ సర్కార్ ప్రజాదరణ సాధించారని ప్రతీతి. కానీ త్రిపురలో వ్యక్తిగతంగా మాణిక్ సర్కార్ నిజాయితీగా ఉంటూ తన ఇమేజ్ పెంచుకుంటున్నారు. మాణిక్ సర్కార్, ప్రధాని మోదీ వ్యక్తిగత ఇమేజీ, ప్రతిష్ఠ ఏ మేరకు ఎవరికి లబ్ధి చేకూరుస్తాయన్న సంగతి వేచి చూడాల్సిందే.
త్రిపురలో ఇలా అధికారంలో లెఫ్ట్ ఫ్రంట్
త్రిపురలో 25 ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా సీపీఎం అధికారంలో ఉండటంతో మాణిక్ సర్కార్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత పెరిగింది. దీంతో సంబంధం లేకుండా మంచి పనితీరు ప్రదర్శించి అధికారంలోకి రావాలని సీపీఎం భావిస్తోంది. 1978లో తొలిసారి సీపీఎం సారథ్యంలో పశ్చిమ బెంగాల్లోనూ, త్రిపురలోనూ అధికారంలోకి వచ్చిందీ లెఫ్ట్ ఫ్రంట్. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల తర్వాత మమతాబెనర్జీ సారథ్యంలోని త్రుణమూల్ కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. అలాగే త్రిపురలోనూ 1978 - 88 మధ్య సీపీఎం అధికారంలో ఉన్నది. కానీ 1993 నుంచి సీపీఎం అధికారంలో ఉంది. 1988 - 93 మధ్య కాంగ్రెస్, త్రిపుర ఉపజాతి సమితి కలిసి సంకీర్ణ కూటమిగా అధికారంలో ఉన్నాయి.
కాలనుగుణంగా విధానాల మార్పులో సీపీఎం వెనుకంజ
ప్రస్తుతం దేశంలోని రెండు రాష్ట్రాలు కేరళ, త్రిపురల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. 34 ఏళ్లు వరుసగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు శరవేగంగా పట్టు కోల్పోయారు. త్రుణమూల్ కాంగ్రెస్, బీజేపీ తర్వాత కమ్యూనిస్టులు మూడో స్థానానికి చేరిపోయారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విధానాలను మార్చుకోవడంలో సీపీఎం 60 ఏళ్లుగా వరుసగా విఫలం అవుతూనే ఉన్నది. యువతను ఆకట్టుకునే విధానాల రూపకల్పనలో వెనుకబడుతున్నదన్న విమర్శ ఉన్నది. 2020 నాటికి సగటు భారతీయ యువత వయస్సు 29గా ఉంటుందని ఒక అంచనా. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని సీపీఎం శ్రేణులు పరస్పరం గ్రూపు కుమ్ములాటలతో ఘర్షణ పడుతూనే ఉంటారు.
2004 తర్వాత రెండంకెల స్థాయి నుంచి సింగిల్ డిజిట్కు సీపీఎం బలం
కాంగ్రెస్ పార్టీతో ద్వేషం కం ప్రేమతో కూడిన రాజకీయ సంబంధాల వల్లే సీపీఎం ఈ స్థాయికి పతనమైందన్న అభిప్రాయాలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. 2004లో అత్యధికంగా 43 లోక్సభ స్థానాలను గెలుచుకున్న సీపీఎం.. తర్వాతీ కాలంలో అనుసరించిన ఫేలవమైన రాజకీయ వ్యూహాల వల్ల ఎన్నికల పోరాటంలో సింగిల్ డిజిట్ సంఖ్యకు పరిమితం కావడం ఆ పార్టీ స్వయంక్రుతాపరాధం అంటే అతిశయోక్తి కాదు.
ఈశాన్య భారతంలో బలం క్రమంగా పెంచుకున్న బీజేపీ
ప్రస్తుతం అసోంతోపాటు ఎనిమిది ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఐదింట బీజేపీ అధికారంలో ఉన్నది. సిక్కింలో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, నాగాలాండ్లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్య పక్షాలు. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన తర్వాత అసోం, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని నార్త్ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ) ఈశాన్య భారత రాష్ట్రాల్లో బీజేపీ పట్టు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటిముఖం పట్టించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే అభివ్రుద్ధి సాధ్యమన్న నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. అది త్రిపురలో ఏ మేరకు నిజమవుతుందో చూడాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఐఎన్పీటీ ఆందోళన
త్రిపురలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ఇండిజినియస్ నేషనలిస్టు పార్టీ ఆఫ్ త్రిపుర (ఐఎన్పీటీ)తో బీజేపీ వ్యూహాత్మక పొత్తు పెట్టుకుంది. ఐఎన్పిటీ 2013లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది తద్వారా 7.6 శాతం ఓట్లు సాధించుకున్నది. త్రిపుర రాష్ట్ర జనాభాలో 31 శాతం జనాభా గిరిజనులే. వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 స్థానాలకు 20 స్థానాలను గిరిజనులకు రిజర్వు చేశారు. మరోవైపు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరు దిబా చంద్ర రంగ్ఖ్వాల్ బీజేపీలో చేరారు. ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ త్రిపురలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.
2016 నుంచీ బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యేల వలసలు ఇలా
2017 ఆగస్టులో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కమలనాథుల్లో విశ్వాసాన్ని పెంపొందించింది. 2013లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు 2016 జూన్ నెలలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే 2014 లోక్సభ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 9.7 శాతం ఓట్లు పొందినా ఫిరాయింపులతో దెబ్బ తిన్నది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ కూడా తమకు ప్రధాన పోటీ బీజేపీతోనేనని పేర్కొనడం గమనార్హం. ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ పోటాపోటీగా బరిలో నిలిస్తే.. ఈ సారి సీపీఎంతో బీజేపీ తలపడుతోందన్నారు.
ప్రధాని మోదీ ‘ట్రిపుల్ టీ’నినాదం ఇలా
అభివ్రుద్ధిలో వెనుకబాటు, ఎకనమిక్స్ ట్రాక్ రికార్డు అంశాలతో బీజేపీ యువతకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. యువతలో భ్రమలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో వ్యక్తిగత ఆదాయం 71,666 కాగా, త్రిపురలో 17 శాతం తక్కువ అని గణాంకాలు చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏడో వేతన కమిషన్ వేతనాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంటే త్రిపురలో ఇప్పటికే నాలుగో వేతన సంఘం సిఫారసులే అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుర అంటే ట్రేడ్, టూరిజం, యువతకు ట్రైనింగ్ అన్న ట్రిపుల్ ‘టీ'లుగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారానికి త్రిపుర అనువుగా ఉంటుందని అభిప్రాయాలు ఉన్నాయి. త్రిపురలో కేవలం 25 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. ఒక లోక్ సభ స్థానం పునాది మెట్రో సిటీ స్థాయిలోనే ఉంటుంది.
బీజేపీ అవకాశాలు ఉన్నా కేక్ వాక్ మాత్రం కాబోదు
మాణిక్ సర్కార్ సారథ్యంలోని సీపీఎం ప్రభుత్వంపై పోటీ చేస్తున్న బీజేపీ.. యధాతథంగానే సీఎం అభ్యర్థిని రంగంలోకి దించడం లేదు. ఇది మాణిక్ సర్కార్ వర్సెస్ మోదీ అన్నట్లుగా సాగుతోంది. ఈశాన్య భారతంలో పవన్ కుమార్ చామ్లింగ్, గేగాంగ్ అపాంగ్, లాల్ థన్హావాలా వంటి కొందరు ప్రముఖ నేతలు మాత్రమే కీలకం. త్రిపురలో బీజేపీ, సీపీఎం మధ్య ఒక రకమైన ప్రచారంతో కూడిన ఎన్నికల సంగ్రామం సాగుతున్నది. బీజేపీ వ్యూహకర్తలు తమకు మంచి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారే గానీ.. అదేమీ కేక్ వాక్ మాత్రం కాదని రాజకీయ విమర్శకులు స్పష్టం చేస్తున్నారు.
త్రిపురలో బెంగాలీ మాట్లాడే వారే 70 శాతం
మానవ వనరుల అభివ్రుద్దిలో త్రిపుర ఆరోస్థానంలో ఉన్నది. ఇక రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో, త్రిపురలో శాంతి సుస్థిరతలను నిలుపడంలో కీలకపాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు. నాయకుడిగా మాణిక్ సర్కార్కు గల వ్యక్తిగత ప్రతిష్ఠ, బీజేపీ మిషన్కు ప్రధాన అడ్డుగోడ నిలిచిందన్న విమర్శలు ఉన్నాయి. త్రిపురలో 70 శాతం మంది ప్రజలు బెంగాలీ భాష మాట్లాడుతారు. కనుక త్రుణమూల్ కాంగ్రెస్ ప్రభావాన్ని కాదని చెప్పగల పరిస్థితి లేదు. కనుక త్రిపురలో పోటీ త్రిముఖంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.