విద్యార్థులపై కాల్పులు భరతమాత గొంతునొక్కడమే, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై కాల్పులు జరిపి భారతమాత గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన సందర్భంగా జరిపిన కాల్పుల్లో విద్యార్థులు నెలకొరిగిన సంగి తెలిసిందే.
సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్ ఘాట్ వద్ద 'సత్యగ్రహ' ఆందోళన చేపట్టింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ముఖ్య నేతలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. ప్రధాని మోడీ విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆందోళన చేస్తున్నవిద్యార్థులపై కాల్పులు జరిపుతున్నారని, లాఠీలు ఝులిపిస్తున్నారని, జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు కూడా శాంతియుతంగా పోరాటం చేశామని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. శాంతియుతంగా పోరాడి, ప్రేమతోనే స్వాతంత్ర్యం సాధించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కానీ బానిసత్వ ఛాయలు పోలేదనిపిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. చిన్న వ్యాపారులను కూడా వదలడం లేదని.. ఇక బడా పారిశ్రామికవేత్తల సంగతి అయితే చెప్పక్కర్లేదని చెప్పారు. మోడీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక ప్రగతి 4 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. దీనికి మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.