ఆ ట్వీటు .. హాట్ కేకు : మిషన్ శక్తి ప్రకటన ట్వీట్కు బోలెడు లైకులు
ఢిల్లీ : సోషల్ మీడియా .. క్షణంలో నెటిజన్లను చేరే సామాజిక మాధ్యమం. దీంతోనే అన్నివర్గాల వారికి చేరువయ్యారు ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదపడింది. టెక్నాలజీని వాడటంలో దిట్ట మోదీ. ఇవాళ ఆయన చేసిన ఓ ట్వీటు హాట్ కేకులా మారింది.
నిమిషంలో వెయ్యి లైకులు
బుధవారం .. ఉదయం 11.23 నిమిషాలు ... ప్రధాని మోదీ ట్వీట్ పేజీ ... అప్పుడే ఉదయం 11.45 గంటలకు జాతినుద్దేశించి మోదీ మాట్లాడతారని ట్వీట్ చేశారు. అంతే మోదీ ఏం మాట్లాడాతారో ? ఏ చెబుతారో అనే ఉత్కంఠ నెలకొంది. ఇంకేముంది నెటిజన్లు మోదీ ట్వీట్ను లైక్ చేసేందుకు పోటీపడ్డారు. ఈ ట్వీట్ తెగ వైరలైంది.
ఏం చెబుతారబ్బ ?
దీంతో మోదీ ఏం చెబుతారబ్బ అనే చర్చ జరుగుతోంది. కీలక ప్రకటన ఏమైనా చేస్తారా అని తెగ చర్చించారు. గతంలో 2016 నవంబర్ 8న ఈ తరహాలో ప్రసంగిస్తారని ప్రకటించారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో ఇప్పుడు కూడా అలాంటి ప్రకటన ఏమైనా చేస్తారా అని నెటిజన్లు తెగ ఆతృతగా ఎదురుచూశారు.
విషయమిదీ ?
అంతరిక్షంలో అద్భుత విజయం సాధించినట్టు మోదీ పేర్కొన్నారు. కఠినమైన మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసినట్టు తెలిపారు. అంతరిక్షంలో శాటిలైట్ను పడగొట్టామని చెప్పారు. కక్ష్యలో తక్కువ ఎత్తులో తిరుగుతోన్న శాటిలైట్ను 3 నిమిషాల్లోనే కూల్చివేశామని ప్రకటించారు. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి అని తెలిపారు.