షీలామీద గెలుపుపై కేజ్రీవాల్ ట్వీట్: రాజే,సింగ్లపై మోడీ
న్యూఢిల్లీ/భోపాల్: దేశంలో రాజకీయ విప్లవం ఆరంభమైందని, నవతరం చైతన్యంతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఎఎపి అనూహ్య రీతిలో అధికార కాంగ్రెసు పార్టీని మట్టికరిపించి బిజెపి తర్వాత స్థానంలో నిలబడింది. దీనిపై కేజ్రీవాల్ పైవిధంగా ట్విట్టర్లో స్పందించారు. గెలుపు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బిజెపి వాళ్లు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారు ఎవరితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
వరుసగా మధ్యప్రదేశ్లో అధికారం కట్టబెట్టిన ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీలోని పెద్దల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని, ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామన్నారు. ఈ విజయం కార్యకర్తలు, ప్రజలది, బిజెపి సిద్దాంతాలదన్నారు. అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకు వెళ్లడమే తాము సాధించిన విజయమన్నారు.
భారత దేశంలో సుపరిపాలనకు శివరాజ్ సింగ్ చౌహాన్ చిరునామాగా మారారని బిజెపి ఎంపి అనంత్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని నాయకులు, కార్యకర్తలు, అందర్నీ కలుపుకొని శివరాజ్ సింగ్ విజయం సాధించారని, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు.
అభివృద్ధి చేస్తే ప్రజలు ఆదరిస్తారని నాలుగు రాష్ట్రాల ఫలితాలను బట్టి తేటతెల్లమయిందని హైదరాబాదులో బిజెపి నేత కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసుకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, ప్రధానిగా ఎవరుండాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాము అన్ని స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నామన్నారు. దేశంలో ప్రజలు బిజెపివైపు చూస్తున్నారన్నారు. కాగా, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజేలు గెలుపొందడంతో మోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
ఓటమికి బాధ్యత: జ్యోతిరాదిత్య
ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. మధ్యప్రదేశ్లో బిజెపి విజయానికి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన తప్ప నరేంద్ర మోడీ ప్రభావం కాదన్నారు.
నాయకత్వ సమస్య లేదు: సచిన్ పైలట్
కాంగ్రెసు పార్టీలో నాయకత్వ సమస్య లేదని కేంద్రమంత్రి సచిన్ పైలట్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావాన్ని చూపిందని, దేశ రాజకీయాల్లో ఇది కొత్త పరిణామమని, ఆమ్ ఆద్మీనీ ఎలా ఎదుర్కోవాలో పార్టీ పెద్దలలు చర్చిస్తారన్నారు.