అవును! నేనూ చౌకీదారుడినే..! పేరడీలతో ఆడుకుంటున్న నెటిజన్లు: బెడిసికొడుతున్న మోడీ ప్రచారం
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నరేంద్రమోడీకి తిరుగులేదు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లల్లో మోడికి కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో చాలామంది నకిలీలుగా తేలింది. అది వేరే విషయం. 2014 ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను మోడీ వాడుకున్నట్లుగా బహుశా మరొకరు వినియోగించి ఉండకపోవచ్చు. దీనితో ఆయనకు గ్యాడెట్స్ గాడ్ కుగా అభివర్ణించుకున్నారు టెక్కీలు. అదలా వుంచితే- వచ్చే ఎన్నికల్లోనూ సోషల్ మీడియాపై కన్నేశారు మోడీ. తన ట్విట్టర్ అకౌంట్ ను ప్రచార వేదికగా మార్చుకున్నారు. వరుస ట్వీట్లను సంధిస్తున్నారు.
ఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియో
తాజాగా శనివారం ఆయన మొదలు పెట్టిన మై భీ చౌకీదార్ హూ (నేనూ చౌకీదారుడినే) అన ప్రచారం.. బూమరాంగ్ అవుతోందా అనిపించేలా ఉంది. నేనూ చౌకీదారుడినే అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసి, దేశ బలోపేతం కావడానికి మీ సహకారం కూడా అవసరం.. అని కోరుతూ మోడీ వదిలిన ట్వీట్లు ఆటోమేటిక్ గా రాజకీయ ప్రత్యర్థులకు, దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులకు ట్యాగ్ అవుతున్నాయి. వాటిని చూసిన జనం ట్రోల్స్ మీద ట్రోల్స్ తో అదరగొడుతున్నారు.
Your Chowkidar is standing firm & serving the nation.
— Chowkidar Narendra Modi (@narendramodi) March 16, 2019
But, I am not alone.
Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.
Everyone working hard for the progress of India is a Chowkidar.
Today, every Indian is saying-#MainBhiChowkidar
నేనూ చౌకీదారుడినే అనే ట్వీట్ ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీ, అంబానీ, లాలూ ప్రసాద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఆటోమేటిక్ గా ట్యాగ్ అవుతోంది. దీనితో వాటిపై రసవత్తరమైన ట్రోల్స్ పడుతున్నాయి. చాలామంది మోడీ వ్యతిరేకులు ఈ ట్వీట్లను అడ్డు పెట్టుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ ఏ రకంగా భారత్ బలోపేతానికి సహాయపడతాడని ప్రశ్నిస్తున్నారు. అంబానీలకు దోచుకోవడమే తెలుసని, వారి నుంచి చౌకగా జియో రీఛార్జి తప్ప మరేమీ ఆశించలేమంటూ విమర్శిస్తున్నారు. తమ విమర్శలను మోడీకి ట్యాగ్ చేస్తున్నారు.