బిజీ లైఫ్కు కాస్త విరామం ఇచ్చి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఈ తరానికి ప్రధాని మోడీ పిలుపు
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన మూడవ దఫా ఇంటర్వ్యూలో మోడీ యోగా పై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానంతో అనేక లాభాలున్నాయని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. యోగాతో ఆరోగ్యలాభాలతో పాటు మానసిక వికాసం అలబడుతుందని చెప్పారు. హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ...వెంటనే ప్రజా సేవకు అంకితమయ్యారు. అహ్మదాబాద్కు వెళ్లి అక్కడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాశ్వత సభ్యుడిగా ఉంటూ సేవ చేయడం ప్రారంభించారు.
ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలైన హిమాలయాల్లో తనను తాను అన్వేషించుకున్న నరేంద్రమోడీ
"ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రపరిచేందుకు వంతులుగా పనిచేసేవాళ్లం. తమ సహచరుల కోసం ఆహారం, టీ చేయడంతో పాటు అక్కడి పాత్రలను కూడా శుభ్రపరిచేవాళ్లం. " అని మోడీ చెప్పారు. " అయితే హిమాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ దొరికిన మనశ్శాంతి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పనిచేసినప్పుడు లభించలేదు . అప్పుడే ప్రతిఏటా ఆత్మపరిశీలన చేసుకునేందుకు కొంత సమయం కేటాయించేవాడిని. అక్కడే లోటుపాట్లను తెలుసుకుని జీవితాన్ని సమతుల్యంగా మలచుకున్నాను" అని చెప్పారు.
ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో డ్యూటీలు చేయాల్సి వచ్చేదని చెప్పారు ప్రధాని. తీరికే ఉండేది కాదని వెల్లడించారు. " అప్పుడప్పుడు తన బంధువు నడిపే క్యాంటీన్లో కూడా ఆయనకు సహాయం చేసేవాడిని" అని చెప్పారు. అంతేకాదు నగర పోకడలో పడి తనని తాను ఎన్నడూ మరిచి ప్రవర్తించలేదని మోడీ గుర్తుచేసుకున్నారు. హిమాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ నేర్చుకున్న సిద్ధాంతాలను మరవకుండా అలానే అలవాటు చేసుకున్నట్లు చెప్పారు. హిమాలయాలనుంచి నేర్చుకున్న సిద్ధాంతాలను మరవకుండానే ఈ కొత్త జీవితాన్ని నడపాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. ఇందుకోసమే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కేటాయించి ఆత్మపరిశీలను చేసుకుంటానని వెల్లడించారు. ఇలా చేస్తూ జీవితం సమతుల్యంగా ఉండేలా చూసుకుంటానని చెప్పారు.
దీపావళి సమయంలో ఐదురోజులు సమయం తీసుకుని ఆత్మపరిశీలన చేసుకునేవాడని చెప్పారు ప్రధాని. ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఘటనలను కూడా నెమరువేసుకునేవారని చెప్పారు. మోడీ ఆత్మపరిశీలన చేసుకునే సమయంలో ప్రజలకు, రేడియోకు, దినపత్రికలకు, టీవీకి దూరంగా ఉంటారని చెప్పారు. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే అడవిలోనే అది సాధ్యమవుతుందని భావించి అక్కడికి వెళ్లేవాడినని చెప్పారు ప్రధాని మోడీ.
"ఇలా అడవిలోకి వెళ్లి ధ్యానం చేసుకోవడం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనగలిగే శక్తి ఉంది. ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోవడం వల్లే జరిగింది" అని చెప్పిన ప్రధాని మోడీ... అడవికి వెళ్లి ఎవరిని కలుస్తావని ప్రశ్నిస్తే... తనను తాను కలిసేందుకే అడవికి వెళుతున్నానని సమాధానం చెప్పేవారట.
ఆత్మపరిశోధన లేదా ఆత్మపరిశీలన చేసుకునేందుకు ప్రజలు కచ్చితంగా సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. తన జీవితం ఎలాగైతే సమతుల్యంగా ఉందో అలానే ఆత్మపరిశీలన చేసుకునే ప్రతిఒక్కరి జీవితం మారుతుందని సెలవిచ్చారు. తన జీవితాన్ని తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రయాణం చేయాలని యువతకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. బిజీ షెడ్యూల్నుంచి బ్రేక్ తీసుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందన్నారు. ఎంతో వేగవంతంగా సాగుతున్న జీవనంలో ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యమన్న ప్రధాని మోడీ... జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులను ధైర్యంగా నిలిచి విజయం సాధించొచ్చని చెప్పారు.
"మీరు ఏదైతే చేయాలని భావిస్తున్నారో అది కచ్చితంగా చేసి తీరుతారు" అని మోడీ చెప్పారు. " మీలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాదు ఇతరులు మీ గురించి ఏమనుకున్నా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉండే లక్షణం అలవడుతుంది. ఇదంతా క్రమంగా మీకు తెలుస్తుంది. మీకు మీరే సాటి.. మీకు మీరే ప్రత్యేక వ్యక్తి. వెలుగు కోసం బయట చూడక్కర్లేదు. మీరే ఒకరికి వెలుగు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మీలోనే ఉంది. " అని మోడీ చెప్పారు.
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఐదు దఫాలుగా ఇచ్చిన ఇంటర్వ్యూలు మోడీ జ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు. జ్ఞానాన్ని సంపాదించేందుకు జీవితంలో ఆయన చేసిన ప్రయాణాల గురించి పంచుకున్నారు. మొదటి దఫా ఇంటర్వ్యూలో తన బాల్యం, కుటుంబం, తన తల్లిపై ఉన్న ప్రేమ గౌరవం గురించి మాట్లాడారు. రెండో దఫా ఇంటర్వ్యూలో తన జీవిత గమ్యం ఎటువైపు ఉందో స్పష్టత తెచ్చుకునేందుకు తాను ఏమి చేశారో అనే అంశంపై మాట్లాడారు.