మోడీ వర్సెస్ వాద్రా... రాబర్ట్ వాద్రాని జైలుకు పంపిస్తానన్న మోడీ ... వేదిస్తున్నారంటున్న వాద్రా
ప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ నాయకుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో మోడీ పదేపదే రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానని చెప్పటం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చకు కారణం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ ''తిట్ల డిక్షనరీ '' అందులో ప్రేమ కూడ ఉంటుంది ! ఇది సినిమా క్యాప్షన్ కాదు
రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానన్న మోడీ
హరియానాలోని ఫతేబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ రాబర్ట్ వాద్రాపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే, రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరించారు. రైతులను లూటీ చేసిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు మోడీ . రైతులను మోసం చేసిన వారు తమను ఎవరూ తాకలేరని అనుకుంటున్నారని, అటువంటి వాళ్లను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసుకెళ్లానని వ్యాఖ్యానించారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తానని చెప్పిన మోడీ, ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ఎన్నో సమస్యలుండగా మోడీ నాగురించే మాట్లాడుతున్నారన్న రాబర్ట్ వాద్రా
ఇక మోడీ వ్యాఖ్యలకు రాబర్ట్ వాద్రా కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రధాని మోదీ తన గురించి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు . దేశంలో ఎన్నో సమస్యలుంటే వాటిని వదిలేసి తనను మోడీ టార్గెట్ చేశారని ఆయన విమర్శించారు. మోడీ ఎన్నికల ర్యాలీల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాద్రా తన ఫేస్ బుక్ , ట్విట్టర్ ఖాతాలో వరుస పోస్ట్ లు చేశారు.గత ఐదేళ్ళుగా మోడీ ప్రభుత్వం తనను వేధింపులకు గురి చేస్తుందని, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని ఆయన అన్నారు.
టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు...వ్యక్తిగత విమర్శలు ఆపాలని కోరిన రాబర్ట్ వాద్రా
భారతదేశ చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తనకు గౌరవం ఉందని, వాటిని అగౌరవపరిచేలా మాట్లాడొద్దని వాద్రా హితవు పలికారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, మహిళా సాధికారత మొదలైన సమస్యలు ఎన్నో ఉంటే వాటిని పక్కనపెట్టి తన గురించి మోడీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను టార్గెట్ చేసి కావాలని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పన్నుల శాఖల నుంచి తనకు నోటీసులు పంపుతున్నారని వాద్రా పేర్కొన్నారు . ఇప్పటి వరకూ తనకు ఎన్నో నోటీసులు జారీ చేశారని, అయితే, ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేదని వాద్రా గుర్తు చేశారు .మోడీ ప్రసంగాల ద్వారా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను దయచేసి ఆపాలని కోరారు రాబర్ట్ వాద్రా.