ఆ 40 సీట్లు మినహాయించినా మోడీయే ప్రధాని: వైగో
చెన్నై: వచ్చే లోకసభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని 40 స్థానాలను లెక్కలోకి తీసుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఎండిఎంకె నాయకుడు వైగో అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.
‘దేశ వ్యాప్తంగా మోడీ ప్రభావం ఉంది. అతడు తమిళనాడు, పాండిచ్చేరిల్లోని 40 లోకసభ స్థానాలను పరిగణలోకి తీసుకోకుండానే ప్రధాని కాగలరు' అని వైగో తెలిపారు. ఇటీవలే బిజెపితో ఎండిఎంకె పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. శనివారం ఎండిఎంకె పార్టీ మెనిఫెస్టో విడుదల చేసిన సందర్బంగా వైగో పై విధంగా స్పందించారు.
ఎండిఎంకె తమిళనాడు రాష్ట్రంలోని ఏడు స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ఏఐఏడిఎంకెకు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా వృథాయేనని చెప్పారని, అయితే ప్రజలకు ఏ పార్టీకి ఓటు వేయాలో తెలుసునని వైగో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టే అవకాశమేలేదని ఆయన అన్నారు. బిజెపి, బిజెపికి మద్దతు తెలిపే పార్టీలకు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా ప్రయోజనం ఉండదని వైగో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పార్టీలను కూడా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కాగా, వైగో విరుధ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.