దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ: మెరుగైన భారత్ కోసం..!
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా ఏడాది పాలన పూర్తైన సందర్భంగా నరేంద్రమోడీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గడచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు.
ప్రధాని మోడీ లేఖను ఇంగ్లీషులో ఇక్కడ చదవండి
ప్రధాని నరేంద్రమోడీ లేఖ పూర్తి పాఠం
'నా ప్రియమైన దేశ ప్రజలారా...'
కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో దేశంలోని నిరుపేదలు, ప్రజలు, రైతులు, కార్మికులు తన కళ్లముందు కనిపిస్తారని, అందువల్లే జన్ధన్ యోజన, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి తదితర పథకాలను ప్రవేశపెట్టానని పేర్కొన్నారు.
అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, తమ ప్రభుత్వం రైతుల పరిహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచిందని గుర్త చేశారు. గత ప్రభుత్వ పాలనలో బొగ్గు, స్పెక్ట్రమ్ పంపిణీ వంటి విషయాల్లో యథేచ్ఛగా వ్వవహరించారని, తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వేలం విధానంలో కేటాయింపులు జరిపిందని అన్నారు.
బొగ్గు గనుల వేలం ద్వారా రూ. 3 లక్షల కోట్లు, స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 1లక్ష కోట్లను ఖజానాకు చేర్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని అన్నారు. 'మేకిన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' వంటి పథకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని అన్నారు.
ముద్రా బ్యాంకు ఏర్పాటుతో చిన్న, మధ్యతరహా కంపెనీలకు రూ. 10 లక్షల వరకూ బ్యాంకు రుణాలను ఇచ్చేలా ఏర్పాటు చేశామని అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు కొత్త చర్యలు చేపట్టామని అన్నారు.
దేశాన్ని క్లీన్ ఇండియా మార్చేందుకు గాను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఆడపిల్లలు బహిర్భూమికి వెల్లకుండా చూడటంతో పాటు, పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా బాలికలు చదువు మానుకునే పరిస్ధితి ఇకపై తలెత్తరాదని తెలిపారు.
అందుకే 'భేటీ పడావో, భేటీ బచావో' అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గంగా నది శుద్ధి కోసం 'మా గంగ' ప్రారంభించామని, ప్రతి గ్రామానికి 24*7 గంటలు కరెంట్తో పాటు రోడ్డు, రైలు మార్గం, 'డిజిటల్ కనెక్టివిటీ'తో అనుసంధానం చేస్తామని తెలిపారు.
తూర్పు ఇండియాని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్మార్ట్ సిటిల్లో ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని తెలిపారు. స్నేహితులారా ఇది కేవలం ఆరంభం మాత్రమే. జీవిత నాణ్యత, సరైన సేవలను అందించడమే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
స్వాతంత్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి, దేశం ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం మీ దీవెనలు, మీ మద్దతు కావాలని కోరారు.
ఎల్లప్పుడూ
మీ
సేవకే
అంకితం
జైహింద్!