చైనా..పాకిస్తాన్ వైపేనా? ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్, డోక్లామ్: కళ్లు కాయలు కాచేలా ఇమ్రాన్
చెన్నై: చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ భారత పర్యటన.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొంది. అన్ని దేశాల కంటే జిన్ పింగ్ పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జిన్ పింగ్ భేటీ అంశాన్ని సునిశితంగా పరిశీలించే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. నరేంద్ర మోడీతో జిన్ పింగ్ సమావేశమైన తరువాత అందులో చర్చల సారంశమేంటీ? దాని ఫలితమేంటి? మోడీ వైఖరి ఎలా ఉందానే విషయంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారని అనుకోవచ్చు.
బెంజ్ కు బాబు..బాంబులు వేసినా చెక్కు చెదరదు: జిన్ పింగ్ కారు ప్రత్యేకతలెన్నో!
పాక్ వైపే చైనా మొగ్గు..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది పాకిస్తాన్. ఆర్టికల్ 370 రద్దును ఎత్తేయించడానికి తన తాహతుకు మించి ప్రయత్నాలు చేసింది. ఎదురుదెబ్బలను తిన్నది. ఈ విషయంలో పాకిస్తాన్ కు అడుగడుగునా అండగా నిలిచిన దేశం.. చైనా. పాకిస్తాన్ కోసం ఏకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సమావేశపరిచింది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా.. పాకిస్తాన్ కు వకాల్తా పుచ్చుకుంది. ఆర్టికల్ 370 రద్దును ఎత్తేయించేలా భారత్ పై ఒత్తిడిని తీసుకుని రావడానికి విఫల ప్రయత్నాలు చేసింది.
డోక్లామ్ జంక్షన్ వివాదంపై స్పందించలేదు గానీ..
ఈ తరహా వాతావరణంలో చైనా అధ్యక్షుడు భారత్ లో అడుగు పెడుతుండటం.. ఊరకనే రారు మహానుభావులు అనే సామెతను గుర్తుకు తెస్తోంది. పాకిస్తాన్ తరఫున చైనా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటూ ఇది వరకే విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారత్- చైనా సరిహద్దుల్లోని సిక్కం వద్ద డోక్లామ్ జంక్షన్ వివాద సమయంలోనూ కమ్యూనిస్టు దేశాధినేతలు పెద్దగా స్పందించలేదు. సుమారు 73 రోజుల పాటు డోక్లామ్ జంక్షన్ సరిహద్దుల్లో భారత్-చైనా జవాన్ల మధ్య తోపులాటలు చోటు చేసుకున్న విషయం తెలిసినప్పటికీ.. మిన్నకుండిపోయింది. అలాంటి పరిస్థితిలోనూ స్పందించని చైనా ప్రభుత్వ పెద్దలు.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత భారత పర్యటనకు వస్తుండటం ఆసక్తికి కలిగిస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ తో సమావేశమైన తరువాత వైఖరి మారిందా?
మూడురోజుల కిందట ఇమ్రాన్ ఖాన్ తో జిన్ పింగ్ సమావేశమయ్యారు. కాశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి సహకారంతో శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని జిన్ పింగ్ ఈ భేటీ ముగిసిన తరువాత వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే.. ఆర్టికల్ 370 రద్దు అంశం జిన్ పింగ్-ఇమ్రాన్ ఖాన్ ల మధ్య ప్రస్తావనకు వచ్చిందనేది తేటతెల్లమైంది. ఇమ్రాన్ తో భేటీ తరువాత జిన్ పింగ్ భారత పర్యటనకు రాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ-జిన్ పింగ్ మధ్య చర్చల కోసం ముందస్తుగా ఖరారు చేసిన అజెండా అంటూ ఏదీ లేకపోవడం, వాణిజ్యపరమైన ఒప్పందాలు కూడా ఉండబోవని కుండ బద్దలు కొట్టడం.. ఇవన్నీ చూస్తోంటే చైనా అధ్యక్షుడి వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పినట్టయిందనేది విశ్లేషకుల అంచనా.
చైనా మీడియా ఏం చెబుతోంది..
జిన్ పింగ్ భారత పర్యటపై చైనా మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ కథనాల్లో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఉప మంత్రి లువో ఝవోహి పేరును ఉటంకించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికే జిన్ పింగ్ భారత్ లో పర్యటిస్తున్నారంటూ విదేశాంగ శాఖ ఉప మంత్రి పేరును ప్రస్తావించాయి. భారత్ తో దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాలు, ఆసియా ఖండంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, ఈ రెండు అంశాలే జిన్ పింగ్ పర్యటనలో ప్రధాన అజెండా ఉంటాయని లువో వెల్లడించినట్లు పేర్కొన్నాయి.