కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మూడ్రోజుల 'భావి భారతం - ఆరెస్సెస్ దృష్టికోణం' ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటంలో నిరుపమాన సేవలు అందించిందని తెలిపారు. ఎందరో గొప్ప నేతలను దేశానికి అందించిందన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావంతో దేశంలో గొప్ప స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు.
ఆరెస్సెస్ సేవలు నిరుపమానం అన్నారు. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఏ ఒక్కరి పైన బలవంతంగా రుద్దలేదని చెప్పారు. ఆరెస్సెస్ను ఇప్పటికీ కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణాల విషంలో ఆరెస్సెస్తో సరితూగే సంస్థ ఏదీ లేదన్నారు.
కాగా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కాంగ్రెస్ పార్టీని స్తుతించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన నాటి కాంగ్రెస్ పార్టీని, అప్పటి నేతలను ప్రశంసించారు. అప్పటి కాంగ్రెస్ నేతల్లో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో తప్పులేదని కొందరి అభిప్రాయం. ఆరెస్సెస్ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనీషా కోయిరాలా, అనూ మాలిక్, రవికిషన్ తదితరులు హాజరయ్యారు.