దూరదర్శన్లో ఆరెస్సెస్ చీఫ్ లైవ్ దుమారం, బీజేపీ చురక
న్యూఢిల్లీ: దూరదర్శన్లో విజయ దశమి పర్వదినం నాడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సంచాలకులు మోహన్ భగవత్ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మండీలోని దూరదర్శన్ కార్యాలయం ఎదుట ఘెరావ్ నిర్వహించాలని కాంగ్రెసు పార్టీ యోచిస్తోంది.
దూరదర్శన్లో ఆరెస్సెస్ చీఫ్ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంపై కాంగ్రెసు పార్టీతో పాటు పలు విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ మాట్లాడుతూ.. మోహన్ భగవత్ ప్రసంగం అవసరమని భావించడం వల్లే లైవ్ టెలికాస్ట్ చేశారన్నారు. మిగతా చానల్స్ అన్ని కూడా భగవత్ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేశాయని, అదే దూరదర్శన్ చేసిందన్నారు. దీనిని మరోలా ఎందుకు చూస్తున్నారని చురక వేశారు. అసలు కాంగ్రెస్ వారి సమస్య వాళ్లు కనిపించడం లేదనే అని ఎద్దేవా చేశారు.
కాగా, మోహన్ భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ చర్యపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ సర్కారుపై విరుచుకుపడ్డాయి. మరోపక్క మోడీ సహా బీజేపీ నేతలు దూరదర్శన్ చర్యను సమర్థించారు. దేశభక్తి కల ఒక సంస్థ నేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విజయదశమి రోజున నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.
సుమారు గంటకు పైగా సాగిన ఈ ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో వివాదం మొదలైంది. భగవత్ ప్రసంగాన్ని మోడీ సమర్థించారు. ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన సాంఘిక సంస్కరణలగురించి భగవత్ తన ప్రసంగంలో పేర్కొన్నారన్నారు. ఎంతో ముఖ్యమైన పలు జాతీయ అంశాలను భగవత్ తన ప్రసంగంలో పేర్కొన్నారని, అవి ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైన సాంఘిక సంస్కరణల గురించి మాట్లాడారని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రసారం చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. ఒక ప్రమాదకర సంప్రదాయానికి దూరదర్శన్ తెరతీసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ అనేది తటస్థంగా ఉండే సంస్థ కాదని, అదొక వివాదాస్పద సంస్థ అని పేర్కొన్నారు. భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమని విమర్శించారు.
ఇప్పటి నుంచి ఈ దేశం నాగ్పూర్ కోసం నాగ్పూర్ ద్వారా, నాగ్పూర్ వల్ల పరిపాలించబడుతుందేమోనని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేశారు. తమ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఈ సందర్భాన్ని ఆరెస్సెస్ ఉపయోగించుకుందని సీపీఎం ధ్వజమెత్తింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలున్నాయనే ప్రత్యక్ష ప్రసారం చేశామంటూ దూరదర్శన్ సమాధానం చెప్పడాన్ని ఆ పార్టీ నేత బృందా కారత్ తీవ్రంగా తప్పుపట్టారు.
అదొక పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. ఓ ఆరెస్సెస్ ప్రచారక్ ప్రధానిగా ఉన్నందునే దూరదర్శన్ ఇటువంటి చర్యలు పాల్పడిందని విమర్శించారు. ఆరెస్సెస్ గొంతుకగా దూరదర్శన్ మారడంపై ప్రసార శాఖ వివరణ ఇవ్వాలని సీపీఐ నేత రాజా డిమాండ్ చేశారు.