డేరా అనుచరుడు మొహిందర్ పాల్ సింగ్ హత్య .. జైళ్లో మట్టుబెట్టిన ఖైదీలు
న్యూఢిల్లీ : డేరా సచ్చ సౌద అధినేత గుర్మిత్ రామ్ రహీం ప్రధాన అనుచరుడు మొహిందర్ పాల్ సింగ్ బిట్టు (48) హత్యకు గురయ్యాడు. డేరా అరెస్ట్ తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో ప్రధాన నిందితుడు మొహిందర్ .. ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే అతనిని తోటి ఖైదీలే దాడి చేసి హతమార్చడం కలకలం రేపుతోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మాటేసి ..
పాటియాలా జైలులో మొహిందర్ పాల్ సింగ్ ఉన్నాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తోటి ఖైదీలు దాడి చేశారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అతను చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మొహిందర్ను గుర్సేవక్ సింగ్, మనిందర్ సింగ్ అనే ఇద్దరు దాడి చేసి హతమార్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. బిట్టు .. డేరా ప్రధాన అనుచరుడు. డేరాకు జైలు శిక్ష తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో బిట్టు కూడా ఒకరు. 150 మంది అనుచరుల్లో బిట్టు పేరు కూడా ఉంది.
తప్పుకు శిక్షేనా ..?
దీంతోపాటు సిక్కుల పవిత్ర గ్రంథం ప్రతిని బిట్టును అవమానపరిచారు. బుర్జ్ జవహర్ గురుద్వారా నుంచి గురుగ్రంథ్ సాహిబ్ దొంగిలించారు. నెల తర్వాత బర్గారి గ్రామంలో దాని ప్రతులు కనిపించాయి. దీంతో సిక్కులు రగిలిపోయారు. మత పెద్దల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల కింద జరిగిన ఘటనకు సంబంధించి .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 10 నెలల క్రితం బిట్టును పాటియాలాలోని నబా జైలులో భారీ భద్రత మధ్య ఉంచారు. అయితే ఇంతలో తన తోటి ఖైదీల చేతిలో హతమవడం కలకలం రేపుతుంది. హతమార్చిన వారు కూడా సిక్కులే కావడంతో ... తమ మత గ్రంథాన్ని అవమానపరిచారనే కారణంతో దాడిచేసి చంపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
శాంతి .. శాంతి ....
పాటియాల జైలులో బిట్టు చనిపోవడంతో పంజాబ్ సర్కార్ అప్రమత్తమైంది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ స్పష్టంచేశారు. అంతేకాదు ఘటనపై నిజానిర్ధారణ కమిటీ వేస్తామని హామీనిచ్చారు. కమిటీ మూడురోజుల్లోనే నివేదిక అందజేస్తుందని .. తర్వాత చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. బిట్టు హత్య తర్వాత శాంతి భద్రతల సమస్య తలెత్తె అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. అందుకోసం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వివిధ మతాల పెద్దలు కూడా సంయమనంతో ఉండాలని .. పుకార్లను నమ్మొద్దని సూచించారు. బిట్టుపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు.