ఇంటర్ పరీక్షలు రాసిన తల్లీకొడుకులు: తల్లి ఫస్ట్ క్లాస్, కొడుకు థర్డ్
గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తన కుమాడితో పాటు ఓ తల్లి ఇంటర్ పరీక్షలకు హాజరైంది. అంతేకాదు, ఎంతో కష్టపడిన ఆమె ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే ఆమెతో పోటీ పడి చదవలేకపోయిన ఆమె కుమారుడు మాత్రం తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు.
వివరాల్లోకి వెళితే.. దిబ్రూగర్ జిల్లాలో నయన్మోని బెజబార్వా(37), అనే మహిళ, తన కుమారుడు అంకుర్ (17)తో కలిసి ఈ ఏడాది నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు హాజరైంది. తల్లి 69.8 శాతం మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో పాసవ్వగా, అంకుర్ మాత్రం అతికష్టం మీద తృతీయ శ్రేణిలో పాసయ్యాడు.
18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసి ఆమెను చదువుకు దూరం చేసినప్పటికీ ఎంతో శ్రమించి ఆమె ఈ ఫలితాన్ని సాధించిందని స్థానికులు చెప్పుకొచ్చారు. నిరుటి ఫలితాల్లో కూడా ఆమె 60 శాతం మార్కులు సాధించి తరగతిలో రెండో ర్యాంకు తెచ్చుకోవడం విశేషం. బెజబార్వాకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
అయితే, అందరిలోనూ అంకుర్ పెద్దవాడు. అతడు తండ్రికి తోడుగా కూరగాయల అమ్మేవాడు. తన తల్లి తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం తనకు ఆనందంగా ఉందని అంకూర్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. తల్లికి మాత్రం అంతగా సంతోషం లేదట. అంకుర్ సాదాసీదాగా పాసవ్వడంతో ఆ తల్లి ఆనందం ఆవిరైంది.
'బెజబార్వాకు పట్టుదల ఎక్కువ. రాత్రింబవళ్లు ఆమె కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది' అని బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సొంటోరా గొగోయ్ ఆమెను మెచ్చుకున్నారు. కుటుంబ ఆర్థిక స్థితి సాధారణంగా ఉండేదని, అందుకే ఉచితంగా పుస్తకాలు, ఫీజు ఇతర ఖర్చుల విషయంలో స్కూలు యాజమాన్యం తోడుగా నిలిచిందని తెలిపారు.