జైలులో 99 రోజులు: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి లభించని ఊరట
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీని మరోసారి పొడిగించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో మనీ లాండరింగ్ కేసుపై విచారణ కొనసాగిస్తోన్న ఢిల్లీలోని రోజ్ వ్యాలీ ప్రత్యేక న్యాయస్థానం చిదంబరం కస్టడీని పొడిగింది. వచ్చే నెల 11వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది.
చిదంబరానికి బెయిల్.. అయినా కస్టడీలోనే: మరో 48 గంటల పాటు తీహార్ జైలులో విచారణ
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారుల కస్టడీలో ఉంటోన్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. అదే ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించ లేదు. ఫలితంగా ఆయన తీహార్ జైలులోనే ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు.
రోజ్ వ్యాలీ న్యాయస్థానం ఇదివరకు ఇచ్చిన కస్టడీ బుధవారం నాటితో ముగిసింది. దీనితో ఈడీ అధికారులు చిదంబరాన్ని ఈ మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. కస్డడీని పొడిగించాలని కోరారు. అదే సమయంలో- చిదంబరం తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తును దాఖలు చేశారు. 99 రోజులుగా చిదంబరం కారాగారంలో ఉంటున్నారని, ఇన్ని రోజులైనప్పటికీ..చిదంబరాన్ని దోషిగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించలేకపోయారని అన్నారు.
ఇదే ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ వ్యవహారంలో చిదంబరంపై సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చిదంబరం పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారాలను, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. తమ విచారణ ఇంకా ముగియలేదని, చిదంబరం నుంచి మరిన్ని కీలకమైన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని వెల్లడించారు.
ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తరువాత.. రోజ్ వ్యాలీ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ కుహర్.. చిదంబరం కస్టడీని వచ్చే నెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ ముగిసిన తరువాత ఈడీ అధికారులు చిదంబరాన్ని ప్రత్యేక వాహనంలో తీహార్ జైలుకు తరలించారు.
కాగా- చిదంబరానికి బెయిల్ ను మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ఈ విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం మరోసారి ఈ పిటీషన్ న్యాయస్థానం సమక్షానికి విచారణకు రానుంది. ప్రస్తుతం చిదంబరం.. ఆశలన్నీ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మీదే ఉన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టే కావడంతో.. ఈడీ కేసు నుంచి బెయిల్ లభించవచ్చని ఆయన ఆశిస్తున్నారు.