దుర్మార్గం : మర్డర్ చేసి.. గోడపై కారణం రాసి...
బనస్కాంత : మానవత్వం మంటగలుస్తోంది. డబ్బు కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ వ్యాపారి ఒక కుటుంబాన్ని అంతం చేశాడు. కత్తితో పీకలు కోసి నలుగురిని దారుణంగా హత్యచేశాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు తాను హత్య చేసేందుకు దారితీసిన కారణాన్ని మృతిని ఇంటి గోడపై రాశాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన గుజరాత్లోని బనస్కాంత ప్రాంతంలో జరిగింది.
టిక్టాక్కు మరొకరు బలి.. చేతులకు గాజులు.. మెడలో మంగళసూత్రం వేసుకుని..
వ్యాపారి నుంచి రూ.21లక్షల రుణం
బనస్కాంత జిల్లా లఖానీ తాలూకా కూడా గ్రామానికి చెందిన ఉకబాయ్ పటేల్ వ్యాపారి. బిజినెస్ కోసం డబ్బు అవసరం ఉండటంతో కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 21 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి పలు మార్లు ఉకబాయ్ ఇంటికి వచ్చి గొడవ చేశాడు. తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు.
నలుగురి గొంతు కోసి
ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు తిరిగి చెల్లించలేకపోయిన పటేల్పై అప్పు ఇచ్చిన వ్యక్తి ద్వేషం పెంచుకున్నాడు. గురువారం రాత్రి మరోసారి వారి ఇంటికి వచ్చి తన సొమ్ము తనకు ఇవ్వాలని గొడవ పడ్డాడు. ప్రస్తుతం డబ్బు చెల్లించే స్థితిలో లేనని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు పటేల్ కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చాడు. కత్తితో పటేల్, ఆయన భార్య, కొడుకు సురేష్, కూతురు అవని గొంతు కోసి చంపాడు.
గోడపై కారణం రాసిన నిందితుడు
శుక్రవారం ఉదయం పటేల్ కుటుంబసభ్యులు ఎవరూ బయటకు రాకపోవడంలో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను మృతుని ఇంటి గోడపై రాశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.21లక్షలు తిరిగి ఇవ్వనందునే ఈ పని చేశానని స్పష్టంచేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు.