వీళ్లు మారరా?: దళితుడ్ని పెళ్లాడిందని కూతురు హత్య
మాండ్యా: పరువు పేరుతో కొందరు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దేశంలో నరమేధం సృష్టిస్తున్నారు. పరువు పరువు అంటూ కన్న ప్రేమను కూడా చంపేస్తున్నారు. వేరే కులం వారిని చేసుకున్నారంటూ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులే వారి పాలిట యమకింకరులవుతున్నారు.
పరువు హత్యలు చేసే వారి కోసం ఉరికంబం సిద్ధంగా ఉంటుందని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే విషయం.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలో పరువు హత్య వ్యవహారం వెలుగు చూసింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబసభ్యులు.
మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల తమిళనాడులో పట్టపగలే శంకర్ అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా చంపేసిన చంపేసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడైన శంకర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు అతికిరాతకంగా అతడ్ని హత్య చేశారు. అతడ్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.