ఓటేసిన లాలూ, నితీశ్: ఓటర్లపై దాడి చేసిన కోతి
పాట్నా: బీహార్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. భక్తియార్పూర్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్కు వచ్చిన ఓటర్లపై ఓ కోతి దాడిచేసి హల్ చల్ చేసింది.
వివరాల్లోకి వెళితే, బీహార్ ఎన్నికల్లో భాగంగా భక్తియార్పూర్ నియోజకవర్గంలో మహిళా కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేద్దామని పోలింగ్ స్టేషన్కు వచ్చిన ఓ వృద్ధురాలిపై ఓ కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అంతక ముందు ఓటు హక్కు వినియోగించుకుందామని పోలింగ్ బూత్కు వచ్చిన ఆరుగురిపై కూడా ఇదే కోతి దాడి చేసి గాయపరిచింది. దీంతో పోలింగ్ బూత్లో కనీస సౌకర్యాలు కల్పించక పోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బిహార్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. 10 స్థానాల్లో సాయంత్రం 4గంటలకు, మిగతావాటిలో 5గంటలకు పోలింగ్ ముగియనుంది.
ఉదయం పది గంటల సమయానికి 34 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆరు జిల్లాలో మొత్తంగా 14,170 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది.
సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల కమిషన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 808 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,45,85,177 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ పట్నాలోని రాజేంద్రనగర్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కుల రాజకీయాలకు పాల్పడటంలేదని, కానీ కుల రాజకీయాలకు బిహార్ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.