తీపి కబురు: రెండు వారాల ముందే దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు
న్యూఢిల్లీ: రైతులకు, ప్రజలకు తీపి కబురు అందింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కన్నా రెండు వారాల ముందే వ్యాపించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 2013 తర్వాత రెండు వారాల ముందే రుతుపవనాలు విస్తరించడం ఇదే తొలిసారని తెలిపింది.
సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. చిట్టచివరగా 45 రోజుల తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ను తాకుతాయి. కానీ, ఈసారి రుతుపవనాలు త్వరగానే దేశ మంతా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. జులై 8వ తేదీలోగా రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించనుండగా.. జూన్ 26 నుంచే వ్యాపించాయని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలను శుక్రవారం తాకాయని, దీంతో దేశమంతా విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల మధ్య భారతంలో రుతుపవనాల వేగం పెరిగినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
ఇప్పటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు పడుతుండగా. ఇప్పుడు ఈశాన్య, ఉత్తర భారతదేశంలో కూడా వర్షాలు ఊపందుకుంటున్నాయి. అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే పిడుగుపాటు కారణంగా బీహార్ రాష్ట్రంలో 83 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పిడుగుపడి 20 మందికిపైగా చనిపోయారు.