గుడ్న్యూస్ : జూన్ 6న కేరళను తాకనున్న రుతుపవనాలు
Recommended Video
రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన రుతుపవనాలు రావాల్సి ఉన్నా ఈసారి ఆలస్యమైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి మాల్దీవులు, ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు అధికారులు చెప్పారు.
సానుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జూన్ ఆరున రుతుపనాలు కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఫలితంగా కేరళతో పాటు తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలుకొని భారీ నుంచి వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో తుఫాను ఏర్పడే పరిస్థితులు ఉండటం రుతుపవనాల గమనాన్ని మరింత వేగం చేయనుంది. సాధారణంగా ఈ సమయంలో ఏర్పడే తుఫాను మరింత బలపడి ఒమన్ వైపు కదిలిపోతాయి. అయితే ఈ సారి మాత్రం అలా జరగకపోవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి తుఫాను దక్షిణ అరేబియా సముద్రంలో కొనసాగనుండటం రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలను గమనాన్ని మరింత పెంచనుంది.
రుతుపవనాలు ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. అసోం, మేఘాలయాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు మరింత బలపడే అవకాశం కల్పిస్తోందని అధికారులు చెబుతున్నారు. జూన్ 8 నుంచి 10 తేదీల మధ్య తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతంతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.