పోటెత్తుతున్న కడలి: కేరళ తీరాన్ని తాకిన నైరుతి! భీకర ఎండల నుంచి ఉపశమనం
తిరువనంతపురం: భారత వాతావరణ విభాగం అధికారుల అంచనాలు ఈ సారి తప్పలేదు. ముందుగా- అంచనా వేసినట్టే నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నానికి కేరళ తీరాన్ని తాకాయి. ఫలితంగా- అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం పోటెత్తుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తాయని, తొలుత ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వారంరోజుల సతాయింపు
నిజానికి రుతు పవనాల రాకలో ఇప్పటికే వారంరోజులు జాప్యం చోటు చేసుకుంది. ఈ నెల 1వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. ఈ పాటికి దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదై ఉండేది. రుతుపవనాలు సకాలంలో తీరాన్ని అందుకోలేకపోయాయి. పసిఫిక్ మహా సముద్రం మీదుగా గగనతలంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం వల్లే నైరుతి రాకలో జాప్యం ఏర్పడిందని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
గతి తప్పిన అంచనా..
6వ తేదీ నాటికి తీరాన్ని చేరొచ్చని తేల్చి చెప్పారు. రెండోసారి కూడా వారి అంచనాలు గతి తప్పాయి. 6వ తేదీ నాటికి కూడా రుతుపవనాలు జాడ కనిపించకుండా పోయాయి. దీనితో తమ అంచనాలను సవరించుకున్నారు అధికారులు. ఈ సారి 8వ తేదీని నిర్ధారించారు. వారి అంచనాలు తప్పలేదు. వాస్తవరూపం దాల్చాయి. వారి అంచనాలకు అనుగుణంగా శనివారం మధ్యాహ్నానికి కేరళ తీరాన్ని తాకాయి. ఫలితంగా- కేరళ ఉత్తర జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి.
కేరళలో చెదురు మదురు వర్షాలు షురూ
మరో 48 గంటల్లో అంటే- ఈ నెల 10వ తేదీ నాటికి మినికోయ్, అమిణి, తిరువనంతపురం, పూనళూరు, కొల్లం, అళప్పుజ, కొట్టాయం, కోచి, త్రిశూర్, కోజికోడ్, థలస్సేరి, కన్నూర్, కర్ణాటకలోని కూడుళు, మంగళూరుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రెండురోజులుగా 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం ఆయా ప్రాంతాల్లో నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ నైరుతి రుతు పవనాల ప్రభావం కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. బెంగళూరు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
కడలి.. కల్లోలం
రుతు పవనాల ప్రభావం వల్ల తమిళనాడులోని ధనుష్కోటి వద్ద హిందూ మహాసముద్రం శనివారం ఉదయం నుంచీ క్రమంగా ఉగ్ర రూపాన్ని సంతరించుకుంటోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీరం వైపు పోటెత్తుతున్నాయి. రుతు పవనాల ఆగమనానికి సంకేతాలుగా భావిస్తున్నారు అధికారులు. ఆకాశం నిర్మలంగా ఉండటం, ఎల్నినో ప్రభావం భయపడేంత స్థాయిలో లేకపోవడం వల్ల నైరుతి రుతు పవనాలు కేరళలో తీరాన్ని తాకిన వెంటనే క్రమంగా విస్తరిస్తాయని అధికారులు వెల్లడించారు.
విస్తరించడానికి వారం రోజులు..
12వ తేదీ నాటికి కర్ణాటకకు చేరుకుంటాయని తెలిపారు. దీని ప్రభావంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 15వ తేదీ నాటికి ఉత్తర తెలంగాణలో రుతు పవనాల ప్రభావంతో వర్షాలు పడతాయని అంచనా వేశారు. ప్రస్తుతానికి రుతు పవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయని, తీరాన్ని తాకిన తరువాత కూడా ఇవే కదలికలు కొనసాగుతాయని అన్నారు.
ఇన్నిరోజుల పాటు మాడు పగిలే ఎండలతో అల్లాడిన ప్రజలకు ఈ వార్త ఉపశమనాన్ని కలిగించేదే. మరో వారం రోజుల్లో రుతు పవనాలు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించవచ్చు. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ ఉత్తర జిల్లాలు, ఏపీలోని కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని తెలుస్తోంది. నైరుతి రాక వల్ల రాయలసీమ, కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.