నైరుతి తిరోగమనం.. అయినా 10 రోజులు భారీ వర్షాలు: పాతికేళ్ల తరువాత తొలిసారిగా..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నెల 10వ తేదీ వరకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం.. సాధారణంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి నైరుతి రుతు పవనాలు తిరుగుముఖం పడతాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన వచ్చని అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా- ఈ వర్షాకాల సీజన్ లో నైరుతి రుతు పవనాలు వెళ్తూ, వెళ్తూ చివరి విడతగా కొన్ని చోట్ల భారీ వర్షాలకు కారణమౌతాయని చెబుతున్నారు.
టీటీడీ క్రౌడ్ మేనేజ్ మెంట్ పై ప్రాక్టికల్స్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారులు
వర్షపాతం 110 శాతం
దేశవ్యాప్తంగా ఈ సారి ఆశించిన, అంచనా వేసిన దాని కంటే అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సగటున 110 శాతం వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు వారు ఓ బులెటిన్ ను విడుదల చేశారు. లాంగ్ పీరియర్ యావరేజ్ (ఎల్పీఏ)తో పోల్చుకుంటే 10 శాతం అధికంగా వర్షాలు కురిశాయని అన్నారు. ఓ వర్షాకాల సీజన్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం చాలా అరుదైన సందర్భమని చెప్పారు. అక్టోబర్ లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటం 1961 తరువాత ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు.
25 సంవత్సరాల తరువాత తొలిసారిగా..
అంచనాలకు మించి 10 శాతం ఎక్కువే వర్షపాతం నమోదు కావడం పాతికేళ్ల తరువాత ఇదే తొలిసారి అని మహాపాత్ర చెప్పారు. 1994లో తొలిసారిగా వంద శాతానికి మించిన వర్షపాతం నమోదైందని అన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు నైరుతి రుతు పవనాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున..గరిష్ఠంగా 10 శాతానికి మించిన వర్షపాతం నమోదవుతుందని ఆయన అంచనా వేశారు. బిహార్ ను అల్లకల్లోలానికి గురి చేసిన భారీ వర్షాలు మంగళవారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రాజస్థాన్ లోనూ నైరుతి రుతు పవనాల ప్రభావం తగ్గిందని చెప్పారు.
తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన
వచ్చే 24 గంటల్లో తమిళనాడు, కేరళలల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లోనూ వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మహారాష్ట్రల్లో సైతం తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతు పవనాలు పుంజుకోవడం వల్లే తీర ప్రాంత రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు.