మోడీకే ఓటు: చంద్రబాబుకు శివసేన షాక్, చక్రం తిప్పిన అమిత్ షా
న్యూఢిల్లీ/ముంబై: అవిశ్వాస తీర్మానం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు కారణాలతో తాను అవిశ్వాస తీర్మానం సమయంలో పార్లమెంటుకు హాజరుకానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను 25వ తేదీ లోపు నెరవేరిస్తేనే సభకు వెళ్తానన్నారు.
మరోవైపు, సీఎం నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం మద్దతు కోసం అన్ని పార్టీలకు లేఖ రాశారు. టీడీపీ ఎంపీలు వివిధ పార్టీలను కలుస్తున్నారు. బీజేపీపై శివసేన గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాంటి శివసేన అవిశ్వాసానికి మద్దతిస్తుందని టీడీపీ భావించింది.
టీడీపీకి శివసేన షాక్
కానీ శివసేన కూడా టీడీపీకి గట్టి షాకిచ్చింది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వవద్దని నిర్ణయించింది. శివసేన గురువారం పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం సమయంలో ఎన్డీయేకు (మోడీ ప్రభుత్వం) అనుకూలంగా ఓటు వేయాలని ఉద్దవ్ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా... ఉద్ధవ్కు ఫోన్ చేశారు. అమిత్ షా జోక్యంతో శివసేన టీడీపీకి షాకిచ్చింది.
బీజేపీ విప్, టీడీపీ వైపు ఉండనని అన్నాడీఎంకే
మరోవైపు, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ (బీజేడీ) కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం ఎంపీలు అందరూ సభకు హాజరు కావాలని అందులో పేర్కొంది. బీజేడీకి 20 మంది ఎంపీలు ఉన్నారు. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అవిశ్వాసానికి మద్దతివ్వమని ప్రకటించింది. తమకు కావేరీ ఇష్యూ సమయంలో ఎవరూ మద్దతివ్వలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే మాత్రం మద్దతిస్తోంది.
అనంత్ కుమార్ విశ్వాసం
అంతకుముందే కేంద్రమంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. శివసేన మద్దతు తమకే ఉంటుందని తేలిపారు. ఎన్డీఏ కూటమి కలిసికట్టుగానే ఉందని, అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో శివసేన వైఖరి చెప్పాలంటూ పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్నందున ఆయన ఈ విధంగా స్పందించారు. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం శివసేన తన నిర్ణయాన్ని టీడీపీకి వ్యతిరేకంగా తెలిపింది.
ఎన్డీయేకు బలం
లోకసభలో ప్రభుత్వానికి తగిన మద్దతు ఉందని, అవిశ్వాసంపై తమకు ఎలాంటి భయం లేదని అనంత్ కుమార్ అన్నారు. లోకసభలో ఎన్డీయేకు 313 సంఖ్యా బలం ఉందని, అవిశ్వాసం నెగ్గడానికి కావాల్సిన 268 సీట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. లోకసభలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నారు.