అలా అని ఎవరు చెప్పారు?: టీడీపీ అవిశ్వాసంపై సోనియా, '20న సత్తా చూపిస్తాం'
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం లోకసభలో చర్చకు రానుంది. టీడీపీకి పలు పార్టీలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
అవిశ్వాసంపై లోకసభలో ఎల్లుండే చర్చ, స్పీకర్ ఖరారు: 'వైసీపీ సభ్యులు లేని టైం చూసి..'
అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ టీడీపీ కాంగ్రస్సేతర, బీజేపీయేతర పార్టీలను కలుస్తోంది. తమను కలవకపోయినప్పటికీ ఏపీ ప్రయోజనాలపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే కాంగ్రెస్ స్వయంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలి. టిడిపి అనే విషయాన్ని పక్కన పెడితే.. మోడీని టార్గెట్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా కాంగ్రెస్ అవిశ్వాసానికి అనుకూలమే.
మాకు నెంబర్ లేదని ఎవరు చెప్పారు?
అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడం, శుక్రవారం చర్చ జరుగుతుందని బీఏసీలో నిర్ణయించిన నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన బలం మీకు ఉందా అని విలేకరులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ... మాకు నెంబర్ బలం లేదని ఎవరు చెప్పారు అని ఎదురు ప్రశ్నించారు. తద్వారా అవిశ్వాస తీర్మానంలో విపక్షం విజయం సాధిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
మా బలాన్ని నిరూపించుకుంటాం
అతివిశ్వాసం పనికి రాదని, జూలై 20వ తేదీన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినప్పుడు తాము మెజార్టీ నిరూపించుకుంటామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మేం మా బలాన్ని సునయాసంగా నిరూపించుకుంటామని సోనియా గాంధీకి కౌంటర్గా మాట్లాడారు.
అవిశ్వాసానికి మేం సిద్ధంగా ఉన్నాం
అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అటల్ బిహారి వాజపేయి సమయంలోను ఇలాగే చేశారని గుర్తు చేశారు. మోడీని భారతీయులు తమ ప్రధానిగా ఎన్నుకున్నారని, వారిపై ఆయనకు విశ్వాసం ఉందని, కాబట్టి మేం అవిశ్వాసానికి సిద్ధమని చెప్పారు.
విపక్షాలకు అవసరమైన మెజార్టీ లేకపోవచ్చు కానీ
అవిశ్వాస తీర్మానంపై సమాజ్ వాది పార్టీ నేత ఆర్జీ యాదవ్ మాట్లాడుతూ.. విపక్షాలకు అవసరమైన మెజార్టీ లేకపోవచ్చునని, కానీ ప్రజల అండ ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ను చేసిందని ధ్వజమెత్తారు.