బెంగళూరులో మరో రెండు రోజులు భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త, జలమయం !
బెంగళూరు: ఐటీ, బీటీ రంగాలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో వర్షాలు పడుతున్నాయి. బెంగళూరు నగరంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. బెంగళూరు నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
బెంగళూరు కేంద్ర విభాగంలో గరిష్టంగా 25.6 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రిల సెల్సియస్, కేఐఎఎల్ (బెంగళూరు ఎయిర్ పోర్టు)లో గరిష్టంగా 27.4 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 20.2 డిగ్రిల సెల్సియస్, హెచ్ఏఎల్ లో గరిష్టంగా 26.6 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 19 డిగ్రిల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైయ్యింది.
కర్ణాటకలోని కొడుగు, బెళగావి, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వివిద రాష్ట్రాల నుంచి విహారయాత్రకు ఈ ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శృంగేరి, ధారవాడ, బెళగావి ప్రాంతాల్లో జలాశయాలు పొంగిపోర్లుతున్నాయి
ఖానాపురలోని మలప్రభా నది పొంగిపోర్లుతున్నది. ఖానాపుర, హళియాళ, యల్లాపురలో జాతీయ రహదారిలో వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. అరేబియా మహాసముద్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో భారీ వర్షాలు పడి ఆనకట్టలు పొంగిపోర్లడంతో ఉత్తర కర్ణాటక జలమయం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లరాదని జాలర్లను వాతావరణ శాఖ హెచ్చరించింది.