రైతాంగానికి చేదు వార్త: వారం ఆలస్యంగా నైరుతి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ.. ఆ పరిస్థితులు కనిపించట్లేదు. సాధారణంగా- ఏటేటా జూన్ 1వ తేదీ నాటికి కేరళను తాకాల్సిన నైరుతి రుతు పవనాల రాకలో జాప్యం నెలకొంది. వారంరోజుల పాటు ఆలస్యంగా కేరళను తాకవచ్చని భారత వాతావరణ శాఖ తాజాగా నిర్దారించింది. వచ్చేనెల 6వ తేదీన నైరుతి రుతు పవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ఫలితం- వర్షపాతంపై కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని చెబుతున్నారు.
ఈ ఏడాది 93 శాతానికి పైగా వర్షపాతం నమోదవుతుందంటూ భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. నైరుతి సీజన్లో 96 నుంచి నూటికి పైగా వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. నైరుతి తొలి సీజన్లోనే జాప్యం చోటు చేసుకోవడాన్ని ఊహించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు అండమాన్ను తాకినప్పటికీ.. ఆ తరువాత దాని కదలికలు నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
జూన్ 6వ తేదీన కేరళను తాకుతాయని, ఆ తరువాత కూడా విస్తరించడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల వచ్చే రెండు నెలలు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆగస్ట్, సెప్టెంబర్లలో పుంజుకోవచ్చని, అవే నెలల్లో కర్ణాటక, మహారాష్ట్ర పరిధుల్లోని పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహిస్తాయని చెప్పారు. కాగా, నైరుతి రుతు పవనాల రాకలో జాప్యం చోటు చేసుకోవడం రైతాంగానికి చేదు వార్తే. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షం వల్లే పెద్ద ఎత్తున పంట దిగుబడి చేతికి అందుతుంది. ఫలితంగా- దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. నైరుతి రాక ఆలస్యం కావడం వల్ల సకాలంలో వర్షాలు కురవకపోతే- దాని ప్రభావం వ్యవసాయ దిగుబడులపై పడే ప్రమాదం లేకపోలేదు.