వాతావరణం: భారీ వర్షాలు, గాలులు, మత్స్యకారులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతంలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం థానే, ముంబై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీటితోపాటు అహ్మద్ నగర్, పర్భంది, యోట్మల్, బ్రహ్మపురి, రాజ్ నంద్ గావ్, భవానీపట్న, పురి, అగర్తాల, లండింగ్, ఉత్తర లఖీంపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విదర్భా, ఛత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాలు, సిక్కిం ప్రాంతాల్లో రాబోయే 24గంటల్లో వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల కారణంగా జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురియనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా ఈ వర్షాలకు తోడుకానుంది. బంగ్లాదేశ్ కోస్తా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వచ్చే అవకాశం కూడా ఉంది. గంటకు 7.6కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి.
కర్ణాటక కోస్తా ప్రాంతం, దక్షిణ కొంకణ్ ప్రాంతం, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉతరకొంకణ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సెంట్రల్ మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, అస్సాం, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ చలి గాలులు వీయనున్నాయి. కాగా, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో గంటకు 60కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.