మాన్సూన్ అప్డేట్స్: చత్తీస్గఢ్, ఒడిశాలలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రుతుపవనాల అనుప్గర్, సికార్, ఆగ్రా, గ్వాలియర్, అలహాబాద్, దాల్తోన్గంజ్ మీదుగా ఈస్ట్ సెంట్రల్ బంగాళాఖాతం వైపు పయనిస్తాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురవనున్నాయి.
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాల మధ్య కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు వచ్చే అవకాశముంది. అల్లకల్లోలంగా మారనున్న సముద్రం. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలో వాయుగుండం తీరం దాటింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవనున్నయి. ఒడిశాతో పాటు చత్తీస్గఢ్, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని అంతకుముందు వాతావరణశాఖ తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్కు తూర్పు ఆగ్నేయ దిశలో 120 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. విశాఖ, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.