మాన్సూన్ అప్డేట్: మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావం కారణంగా రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Recommended Video
అల్పపీడన ప్రభావంతో జార్ఖండ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయి. పశ్చిమ, వాయూవ్య ప్రాంతాల్లో కూడా అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించిన అంచనాల ప్రకారం.. మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఆవరించింది. కాగా, జార్ఖండ్ పైనున్న వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా భూమికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2,3రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అస్సాం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతం, తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, జమ్మూకాశ్మీర్, కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.