మాన్సూన్ అప్డేట్: కొంకణ్, గోవాలలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: సిక్కిం, కొంకణ్, గోవా కోస్ట్, ఉత్తర తమిళనాడు తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్దానా, అమరావతి, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్ తదితర ప్రాంతాల మీదుగా మాన్సూన్స్ కొనసాగుతాయని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా, వచ్చే వారం రోజుల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి అంతకుముందు రోజు వెల్లడించారు. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలను కొట్టివేయలేమన్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు విదర్భ, తెలంగాణ మీదుగా 7.6 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.