వాతావరణం: ఏపీ కోస్తాలో వర్షాలు, సీమ, తెలంగాణలో ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం
న్యూఢిల్లీ: వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు రెండ్రోజులపాటు విరామం తీసుకోనున్నాయి. ఢిల్లీలో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం రాబోయే 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
మంగళవారం వాతావరణ శాఖ విడుదల చేసిన అంచనా ప్రకారం.. మరఠ్వాడా, విదర్భా, ఛత్తీస్ గఢ్, బంగాళాఖాతం వాయూవ్య ప్రాంతంలో వర్షాలు కురియనున్నాయి. వీటితోపాటు పశ్చిమబెంగాల్ లోని పలుప్రాంతాలు, అస్సాం, మేఘాలయాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్ధానా, అమ్రోటి, గోండియా, భవానీపట్న, పురి, కోల్ కతా, సోహ్రా, ఉత్తర లఖీంపూర్ లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రాబోయే 48గంటల్లో రుతుపవనాల కారణంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే వారం రోజులు రుతుపవనా-లు నెమ్మదించిన కారణంగా వర్షాలకు పలు ప్రాంతాల్లో విరామం లభించనుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. కేరళ, ఛత్తీస్ గఢ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, విదర్భా, దక్షిణ కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కర్ణాటకల్లో ఉరుములతో కూడిన వర్షాలు, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గోవా-కర్ణాటక-కేరళ తీర ప్రాంతంలో అలలు ఎగిసేపడే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈశాన్యం, ఉత్తరం, మహారాష్ట వరకు రుతుపవనాలు ఆవరించి ఉన్నాయి.