మాన్సూన్ అప్డేట్స్: ఉత్తర కోస్తాంధ్ర, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన
Recommended Video
న్యూఢిల్లీ: ప్రి-మాన్సూన్ ప్రభావం నార్త్ ఈస్ట్ ఇండియా పైన 26వ తేదీ నుంచి ఉండనుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఢిల్లీ, నార్త్ వెస్డ్ ఇండియా పైన ఈ నెల 28వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ఉండనుంది.
నార్త్ అరేబియా సముద్రం కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్లోని ప్రాంతాలు, చత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఈస్ట్ ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, సౌత్ ఈస్ట్ రాజస్థాన్ తదితర ప్రాంతాలలో రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించనున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే, కొంకణ్, గోవా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశా, పశ్చిమ బెంగాల్లలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
కర్ణాటకలోని సౌత్ ఇంటీరియర్, కోస్టల్ ప్రాంతంలో, ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో, సౌరాష్ట్ర, కచ్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, బీహార్లలోను భారీ వర్ష సూచన ఉంది.
వాతావరణ శాఖ వివరాల మేరకు గత 24 గంటల్లో తూర్పు గుజరాత్, గోవాలలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, నార్త్ ఒడిశా, కోస్టల్ కర్ణాటకలలోను రుతుపవనాలు విస్తరించాయి.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.