మాన్సూన్ అప్డేట్స్: యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాలలో భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: వెస్ట్ రాజస్థాన్, కచ్ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో భారత దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
జూలై 1వ తారీఖున నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తర దిశకు మారింది. ఆ తర్వాత ఉత్తరాది నుంచి హిమాలయాల వైపు పయనిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 1వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఉంటాయి.
ఈ రుతుపవనాల కారణంగా ఉత్తర ప్రదేశ్లోని ఉత్తర ప్రాంతం, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, వెస్టర్న్ హిమాలయాల ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలలో జూలై 1, 2, 3వ తేదీల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ నైరుతి రుతుపవనాల కాలంలో వర్షం/చిరుజల్లుల ప్రభావం ఉన్న ప్రాంతాలు.. జమ్ము కాశ్మీర్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, అండమాన్ నికోబర్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక. హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, కోస్టల్ కర్ణాక, కోస్టల్ ఆంధ్ర, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.