వెదర్ రిపోర్ట్: ఈశాన్య రాష్ట్రాలతోపాటు తెలంగాణలో వర్షాలు, పిడుగుపాటుకు అవకాశం
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశాన్ని చుట్టేశాయి. దీంతో మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురియనున్నాయి.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పైన పేర్కొన్న రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న 2-3రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయువ్య భారతంలో జూన్ 27 వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
జమ్మూకాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో తొలి మూడు వారాల్లో పడిన వర్షపాతం సాధారణం(9శాతం) కంటే తక్కువ నమోదైందని తెలిపింది. అయితే, ముంబై, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం గత పదిరోజుల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది.
జూన్ 1 నుంచి సౌత్ పెనిసుల ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. గత వారం రోజులుగా వాతావరణం వేసవి కాలాన్ని తలపించేలా ఉందని, 39శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. మధ్య భారతంలోకి ఇప్పుడే రుతుపవనాలు ప్రవేశించాయని, 70శాతం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మే 29కే అంటే మూడు రోజుల ముందుగానే కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈశాన్య భారతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గత వారం కొంత విరామం తీసుకున్నాయి. వచ్చే 10-12రోజులు వర్షపాతం సాధారణంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.