మాన్సూన్ అప్డేట్స్: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
Recommended Video
న్యూఢిల్లీ: రానున్న నాలుగైదు రోజుల్లో కూడా ఉత్తర, మధ్య భారత దేశంలో వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాలలోను భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ సీజన్లో ముంబైలో భారీ వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. రోడ్ల పైన మొత్తం నీరు నిలిచింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ప్రజలు మోకాలు లోతు నీటిలో ఇబ్బందులు పడుతూ ముందుకు సాగారు.
జులై 13వ తేదీ వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుంది. రానున్న ఐదారు రోజుల్లో రుతుపవనాల ప్రభావం దక్షిణాది, మధ్య భారతంపై ఉంటుంది. రానున్న 48 గంటల్లో నార్త్ వెస్ట్ ఇండియాలో మరిన్ని వర్షాలు కురవనున్నాయి. ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాలో రానున్న నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
వెస్ట్ మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్రలకు జూలై 11 రెడ్ కలర్ (రేపు) హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ సాధారణంగా నాలుగు రకాల హెచ్చరికలు జారీ చేస్తుంది. రెడ్ కలర్ వార్నింగ్ అంటే తీవ్రమైన హెచ్చరిక.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు దేశంలో వర్షపాతం నమోదు 9 శాతం తక్కువగా ఉంటుంది. ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాలలో 24 శాతం, నార్త్ వెస్ట్లో 8 శాతం, సెంట్రల్ ఇండియాలో 5 శాతం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో దక్షిణాదిన 10 శాతం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.