మాన్సూన్ అప్డేట్స్: జూన్ 24వ తేదీ నుంచి వర్షాలు
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా బలహీనంగా మారిన రుతుపవనాలు, జూన్ 24వ తేదీ నుంచి బలపడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మాసం మొదటి సగభాగంలో చురుగ్గా ఉన్ నైరుతీ రుతుపవనాలు ఆ తర్వాత బలహీనపడ్డాయి. ఇలా బలహీనపడటం సాధారణమేనని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Recommended Video
గత వారం రోజులుగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా లేవు. అయితే జూన్ 24వ తేదీ నుంచి రుతుపవనాలు బలపడనున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో వెస్ట్ ఈక్వెటోరియల్ ఇండియన్ ఓసియన్ వైపు మేడెన్ జూలియన్ ఆసిలేషన్ చురుకైన కదలికలు, అలాగే తూర్పు భారతం వైపు సైక్లోన్ సర్క్యూలేషన్ బలపడే అవకాశమున్నందున బలమైన గాలులు వీస్తాయి.
నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదలనున్న నేపథ్యంలో అసోం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని పలు ప్రాంతాలు, బీహార్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో జూన్ 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రుతుపవనాలు ఆవరించనున్నాయి.
తెలంగాణలో అక్కడక్కడా రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.
జూన్ 23 నుంచి 25 మధ్య ఒడిశా, ఈస్ట్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉండనున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, దక్షిణాదిలోని మరికొన్ని ప్రాంతాల్లోను కురవనున్నాయి.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.