మాన్సూన్ అప్డేట్స్: ముంబైకి ఉపశమనం, ఢిల్లీలో 28-29న వర్ష సూచన
Recommended Video
న్యూఢిల్లీ: భారత వాణిజ్య నగరం ముంబైలో జూన్ 24, 25వ తేదీలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరం అతలాకుతలం అయింది. రుతుపవనాల తాకిడి కారణంగా ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ముంబై నగరం జలమయమైంది.
ముంబైలో మొన్న భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నేడు (బుధవారం) కూడా ఉపశమనంగా ఉంటుందని, మోస్తారు వర్షం కురిసే అవకాశముంది. ఉత్తర కొంకణ్, గుజరాత్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 28, 29వ తేదీలలో ఢిల్లీకి విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రి మాన్సూన్ ప్రభావం నార్త్ వెస్ట్ ఇండియాలో కనిపిస్తోంది.
ఒడిశాలోని చాలా ప్రాంతాలతో పాటు వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్లోని పలు ప్రాంతాలు, జార్ఖండ్, నార్త్ అరేబియన్ సముద్ర తీర ప్రాంతం, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలు, చత్తీస్గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్లోని పలు ప్రాంతాలు, ఉత్తరాఖండ్, సౌత్ ఈస్ట్ రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల ప్రభావంతో రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
ఢిల్లీతో సహా నార్త్ వెస్ట్ ఇండియాలపై ఈ నెల 28, 29వ తేదీలలో నైరుతి రుతు పవనాల ప్రభావం కనిపిస్తుంది. ఢిల్లీలో మోస్తారు వర్షం కురిసే అవకాశముంది.
రుతు పవనాలు తిరిగి ఉత్తేజితం అవుతున్నాయని, ఈ కారణంగా అరేబియా సముద్రం ప్రాంతంలో తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.
కాగా, 24, 25వ తేదీలలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం కాస్త ఉపశమనం ఇచ్చాయి. ఈ వర్షం కారణంగా ఏడుగురు మృతి చెందారు. సోమవారం కంటే మంగళవారం పరిస్థితి బాగుంది. ఆదివారం సాయంత్రం, సోమవారం సాయంత్రం ముంబైలో 231.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.