ఇకపై రాత్రి 9 గంటల వరకు ఆ ప్రదేశాలు తెరిచే ఉంటాయి
దేశంలోని 10 చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు రాత్రి 9 గంటల వరకు అనుమతి ఇస్తూ కేంద్రి సాంకృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం చాలా చారిత్రాత్మక కట్టడాలు వీక్షించాలంటే సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉండేది. ప్రస్తుతం దాన్ని 9 గంటల వరకు పొడగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని హుమయూన్ టూంబ్, సఫ్దార్జంగ్ టూంబ్లతో పాటు భువనేశ్వర్లోని రాజారాణి ఆలయం, ఖజూరహోలోని దుల్హదేవ్ ఆలయం, కురుక్షేత్రలోని షేక్ చిల్లీ టూంబ్, కర్నాటకలోని గోల్గుంబాజ్, మహారాష్ట్రలోని పలు ఆలయాలు, యూపీలోని మన్మహల్, పటాన్ గుజరాత్లోని రాణి కీ బావ్లు ఇకపై సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఇలా మూడేళ్ల పాటు ఉంటాయి.
కొన్ని వారసత్వ ప్రదేశాలు ఇటు పర్యాటకంగానూ అటు ఆధ్యాత్మికంగాను విరాజిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను భక్తులు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటకశాఖ రాత్రి 9 గంటల వరకు సందర్శకుల కోసం తలపులు తెరిచే ఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతకంటే ముందు వారసత్వ ప్రదేశాలను సందర్శకుల కోసం రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంచాలన్న ప్రతిపాదనపై కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంది కమిటీ. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనను పరిగణించిన కమిటీ... రాత్రి 9 గంటల వరకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ వారసత్వ కట్టడాల ద్వారాలు తెరిచి ఉంచడం లేదు.