మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: రాజస్థాన్లో బీజేపీకి షాక్, కాంగ్రెస్కు ఊరట
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.
రాజస్థాన్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా?
రాజస్థాన్లో బీజేపీ పరిస్థితి అంత బాగా లేదని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ కొంత ముందంజలో ఉంది. 5 శాతం ఓట్లు ఎక్కువ సాధిస్తుందని సర్వేలో తేలింది. రాజస్థాన్లో బీజేపీ 39 శాతం ఓట్లు, కాంగ్రెస్ 44 శాతం ఓట్లు, ఇతరులు 17 శాతం ఓట్లు సాధిస్తారని సర్వే ద్వారా వెల్లడైంది.
2013లో బీజేపీకి 45 శాతం, కాంగ్రెస్కు 33 శాతం, ఇతరులకు 22 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీకి గతంలో కంటే ఆరు శాతం ఓట్లు తక్కువ కానుండగా, కాంగ్రెస్ పార్టీకి పదకొండు శాతం పెరగనున్నాయి. రాజస్థాన్వో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో బీజేపీకి 163, కాంగ్రెస్కు 21, ఇతరులకు 16 సీట్లు వచ్చాయి.