మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: గుజరాత్ మళ్లీ బీజేపీదే, పుంజుకుంటున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.
గుజరాత్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
గుజరాత్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 54 శాతం ఓట్లు, యూపీఏకు 42 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 54 రానున్నాయి. అంటే 5 శాతం తగ్గనుంది. గుజరాత్లో కాంగ్రెస్కు 2014లో 33 శాతం రాగా, ఇప్పుడు 42 శాతం ఓట్లు రానున్నాయి. అంటే 9 శాతం పెరిగింది.