మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: మహారాష్ట్రలో బీజేపీ ముందంజ, పుంజుకుంటున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.
మహారాష్ట్రలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
ఏబీపీ సర్వే ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయేకు 48 శాతం, యూపీఏకు 40 శాతం, ఇతరులకు 12 శాతం ఓట్లు రానున్నాయని ఏబీపీ సర్వే తెలిపింది. 2014లో ఎన్డీయేకు 51 శాతం రాగా ఇప్పుడు 48 శాతం రానుంది. 3 శాతం ఓట్లు తగ్గనున్నాయి. అదే సమయంలో యూపీఏకు 2014లో 35 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 40 శాతం రానున్నాయి. ఐదు శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి.
శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయనుంది. అయితే శివసేనతో కలిస్తే బీజేపీకి ఎంత లాభమంటే 2014లో 27 శాతం కాగా, ఇప్పుడు 29 శాతంగా ఉంది. రెండు శాతం ఎక్కువే ఉంది. కానీ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలున్నాయి.