మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: యూపీలో బీజేపీకి ఘోర పరాభవమే, ఎస్పీ-బీఎస్పీకి 53 శాతం
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ ఏ మేర పుంజుకుంది అనేది ఈ సర్వే ద్వారా వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ మిత్రపక్షాలు ఎక్కువ ఓట్లు, సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది. ఏబీపీ సర్వే ప్రకారం ఎస్పీ-బీఎస్పీలు కలిస్తే 53 శాతం ఓట్లను (రెండు పార్టీల ఓట్లు) దక్కించుకోనున్నాయి. ఎన్డీయే 35 శాతం ఓట్లు, యూపీఏ 12 శాతం ఓట్లు దక్కించుకోనున్నాయి.
ఉత్తర భారత దేశంలో బీజేపీ గతంలో కంటే వెనుకబడింది. ఉత్తర ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఆ పార్టీకి 2018 ఆరంభం నుంచి 8 శాతం ఓట్లు తగ్గాయని సర్వేలో వెల్లడైంది. ఎస్పీ, బీఎస్పీల కలయిక వల్ల ఆ పార్టీలకు 4 శాతం ఓట్లు పెరగనున్నాయని సర్వేలో తేలింది.