మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: బెంగాల్లో మమతదే హవా, ఈశాన్య రాష్ట్రాలు బీజేపీవే
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ ఏ మేర పుంజుకుంది అనేది ఈ సర్వే ద్వారా వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
ఈశాన్య ప్రాంతంలో బీజేపీ హవా కొనసాగనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 142 స్థానాలు ఉండగా ఎన్డీయే 86 నుంచి 94 మధ్య, యూపీఏ 22 నుంచి 26 సీట్లు గెలుచుకోనుందని వెల్లడించింది. ఇతరులు 26 నుంచి 30 గెలవనున్నారు. 2018లో ఎన్డీయే 58, యూపీఏ 21, ఇతరులు 61 స్థానాలు దక్కించుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. యూపీఏ 11 శాతం ఓట్లు సాధించనుందని సర్వేలో వెల్లడైంది. 2014లో తృణమూల్ 73 శాతం, ఎన్డీయే 17 శాతం, యూపీఏ 10 శాతం సాధించింది. ఈ లెక్కన తృణమూల్కు కొంత ఓట్ షేర్ తగ్గనుంది.
పశ్చిమ బెంగాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 65 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వే వెల్లడించింది. 2014 కంటే బీజేపీ మాత్రం ముందంజలో ఉండనుంది. 2014లో ఎన్డీయే 17 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు 24 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది.
బీహార్లో బీజేపీ - జేడీయు మిత్రపక్షాల పరిస్థితి బాగానే ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండు పార్టీలు కలిసి 60 శాతం ఓట్లు సాధిస్తాయని తేలింది. అదే సమయంలో యూపీఏ దాని మిత్రపక్షాలు కేవలం 34 శాతం ఓట్లు సాధిస్తాయని తేలింది. మిగతా పార్టీలు ఆరు శాతంతో సరిపెట్టుకోనున్నాయి. బీహార్లో బీజేపీ - జేడీయులపై వ్యతిరేకత అంతగా లేదని సర్వేలో వెల్లడైంది.