మూలిగే నక్కపై తాటిపండు!: బ్యాంకు సెలవులతో కరెన్సీ కష్టాలు తీవ్రం
నాలుగో శనివారం కారణంగా నేడు.. ఆదివారం కావడంతో 27వ తేదీ నాడు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక భారత్ బంద్ సెగ బ్యాంకులకు కూడా తాకితే.. మూడు రోజుల పాటు తీవ్రమైన నగదు కష్టాలను ఎదుర్కోక తప్పదు.
హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది దేశంలో సామాన్యుల పరిస్థితి. ఇప్పటికే నోట్ల కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు.. రెండు రోజుల వరుస బ్యాంకు సెలవులు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టేలా తయారయ్యాయి. సోమవారం నాడు ప్రతిపక్షాల భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా తోడైతే ఇక ఆ కష్టాలు మరింత తీవ్రతరం అవడం ఖాయం.
నాలుగో శనివారం కారణంగా నేడు.. ఆదివారం కావడంతో 27వ తేదీ నాడు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక భారత్ బంద్ సెగ బ్యాంకులకు కూడా తాకితే.. మూడు రోజుల పాటు తీవ్రమైన నగదు కష్టాలను ఎదుర్కోక తప్పదు. రూ.500నోటు మార్కెట్లోకి రావడంతో.. కాస్తంత ఉపశమనం కలిగిందని భావిస్తున్న తరుణంలో.. వరుస సెలవులు సామాన్యుల కష్టాలను మరింతగా పెంచనున్నాయి.
బ్యాంకుల బంద్ కు తోడు.. దేశంలో చాలా ఏటీఎంలు 'అవుట్ ఆఫ్ సర్వీస్' బోర్డుతోనే దర్శనమిస్తుండడం.. సామాన్యుడిలో తీవ్ర అసంతృప్తిని కలగజేస్తున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో.. ఏటీఎం కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటే.. బ్యాంకు సెలవుల ఎఫెక్ట్ కొద్దిలో కొద్దిగానైనా తగ్గే అవకాశముండేది.