మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్
ఢిల్లీ : మహిళా దినోత్సవం సదర్భంగా.. రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రిజర్వేషన్ కోటా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 58 సంవత్సరాలు నిండిన మహిళలకు ఛార్జీలో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. లాంగ్ జర్నీ రైళ్లల్లో లగేజ్ కమ్ గార్డ్ కోచ్ వెంబడి స్పెషల్ గా మహిళా కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుకింగ్ కార్యాలయాలతో పాటు రిజర్వేషన్ కౌంటర్లలో మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక సౌకర్యాలు
దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణీకుల కోసం శానిటరీ న్యాప్కిన్ డిస్పెన్సర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. బాలింతలు ఇబ్బందులు పడకుండా చిన్నపిల్లలకు పాలిచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జననీ సేవ పేరుతో అన్నీ రైళ్లల్లో పిల్లలకు అవసరమైన పాలు, వేడినీళ్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రధాన రైల్వే స్లేషన్లలో మహిళల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ తో పాటు స్పెషల్ టాయిలెట్స్, నిర్భయ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. నెలవారీ పాసుల్లో విద్యార్థినులకు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ప్రత్యేకంగా మహిళా కోచ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
భారతీయ రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగులుంటే.. అందులో లక్షమంది మహిళా ఉద్యోగులున్నట్లు తెలిపారు అధికారులు. రానురాను మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు చెప్పారు. వారి ఆత్మవిశ్వాసం పెంచేలా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళా ఉద్యోగులు మాత్రమే సేవలందించేలా ఇప్పటికే పలు స్టేషన్లను ఆల్ వుమెన్ స్టేషన్లుగా మార్చినట్లు చెప్పారు. రైల్వేలోని మహిళా ఉద్యోగులతో పాటు మహిళా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసే దిశగా ముందుకెళుతున్నామని తెలిపారు.