దినకరన్ దెబ్బకు పళనిసామి దిమ్మ తిరిగింది: 32 మంది జంప్, మంత్రులు, ప్రభుత్వం ఫట్ !
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ వెలివేత నాయకుడు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చే శాసన సభ్యుల సంఖ్య రోజురోజుకు పేరిగిపోతోంది.
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ వెలివేత నాయకుడు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చే శాసన సభ్యుల సంఖ్య రోజురోజుకు పేరిగిపోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద వ్యతిరేకత పెరిగిపోయింది వెలుగు చూసింది.
రజనీకాంత్ వచ్చేశారు: అసెంబ్లీ సమావేశం, మరుసటి రోజే'సూపర్'ప్లాన్, ఏం జరుగుతోంది !
ఇదే సమయంలో ఎడప్పాడి మంత్రి వర్గంలోని మంత్రులు కేటీ. రాజేంద్ర బాలాజీ, కడంబూరు రాజు సైతం దినకరన్ కు మద్దతు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దెబ్బతో పళనిసామి వర్గంలోని 32 మంది ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరిపోయారు. దెబ్బకు హడలిపోయిన ఎడప్పాడి పళనిసామి మిగిలిన ఎమ్మెల్యేలు చెయ్యిజారి పోకుండా చూసుకోవాలని సహచర మంత్రులకు సూచించారని సమాచారం.
తీహార్ జైలు ఫుడ్ తో రీచార్జ్ !
రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న దినకరన్ బెయిల్ మీద బయటకురాగానే దూకుడు పెంచారు. తీహార్ జైలు ఫుడ్ బాగానే వంటపట్టినట్లు ఉందని ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
చిన్నమ్మ చెప్పిందని తెగించాడు !
తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన రెండు రోజుల తరువాత దినకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు చేరుకుని చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారు. ఆ సమయంలో దినకరన్ వెంట కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే దినకరన్ చెన్నై తిరిగి వచ్చిన తరువాత సీన్ మారిపోయింది.
పళనిసామి రెచ్చగొట్టారా ?
పార్టీ కార్యకలాపాలకు శశికళ, దినకరన్ ను దూరం పెట్టాలని ఏప్రిల్ 17వ తేదీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ మీడియాకు చెప్పారు. పళనిసామి రెచ్చగొట్టడం వలనే జయకుమార్ దినకరన్ విషయంలో బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారని తెలిసింది.
తంగ తమిళ్ సెల్వన్ ముందే చెప్పాడు !
22 మంది ఎమ్మెల్యేలు ఉన్న దినకరన్ బలం మరో రెండు రోజుల్లో భారీగా పెరుగుతోందని మొదటి నుంచి ఆయన వర్గంలో ఉన్న ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ చెప్పిన మాట నిజం అయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే దినకరన్ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 32 కు చేరింది.
ఇద్దరు మంత్రుల వత్తాసు
రోజురోజుకు దినకరన్ వైపు చేరుతున్న ఎమ్మెల సంఖ్య పెరిగిపోతుంటే సీఎం ఎడప్పాడి పళనిసామికి ఇద్దరు మంత్రులు షాక్ ఇచ్చారు. చెన్నైలో మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ దినకరన్ కు మద్దతు ప్రకటించారు. దినకరన్ కు బేషరుతుగా మద్దతు ఇస్తున్నారని మరో మంత్రి కడంబూరు రాజు తిరుచెందూరులో బాంబు పేల్చారు.
మిమ్మల్ని సీఎం చేసింది ఎవరు ?
మంత్రి కడంబూరు రాజు తిరుచెందూరులో మీడియాతో మాట్లాడుతూ పళనిసామిని సీఎంగా చేసింది శశికళ అని గుర్తు చేశారు. దినకరన్ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని చెప్పారు. అయితే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం నాలుగేళ్లు ఉంటుందని దినకరన్ కు మద్దతు ఇచ్చిన మంత్రులు కేటీ రాజేంద్ర బాలాజీ, కడంబూరు రాజు చెప్పడం కొసమెరుపు.
దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు వీరే
తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్, మురుగన్, సుబ్రమణియన్, సత్యా పన్నీర్ సెల్వం, పళని, ఉమా మహేశ్వరి, మారియప్పన్ కెనడి, కలశపాక్కం పన్నీర్ సెల్వం, మోహన్, పళనియప్పన్, తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, ముత్తయ్య, రాజన్ చెల్లప్ప, ఏళుమలై, ఇన్బుదురై, బాలు, తంగదురై, పార్తీబన్, కదిరగాము, సెల్వ మోహన్ దాస్ పాండ్యన్, పెరియపూల్లాన్, జయంతి, నరసింహన్, నీదిపతి, ఏకే బోస్, ఇలంబై తమిళ్ సెల్వన్, చంద్రప్రభా, దండపాణి, సుందర్ రాజన్ టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్నారు. 32 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో దినకరన్ ఇప్పుడు చెట్టు మీద కుర్చున్నారు.