చెడ్డవారు మారకుంటే సీతల్కుచి ఘటనలు మరిన్ని జరుగుతాయి: దిలీప్ ఘోష్
కోల్కతా: వచ్చే దశల్లో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెడ్డవారు రెచ్చిపోతే.. కూచ్ బెహర్ సితల్కుచి లాంటి ఘటనలు పునరావృతం అవుతాయని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కేసు నమోదు చేయాలని, అంతేగాక, ఆమెను ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
చెడ్డవారు శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలనుకుంటూ నిన్ని సితల్కుచిలో బుల్లెట్లు తినక తప్పదని ఘోష్ హెచ్చరించారు. చెడ్డవారికి ఇక బెంగాల్ రాష్ట్రంలో స్థానం ఉండదన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలు తుపాకులను షో కోసమే పట్టుకుంటాయని భావిస్తే పోరపాటేనని అన్నారు.
ఎవరైనా తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటే.. వారికి తగిన గుణపాఠం ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు కేంద్ర బలగాలు వచ్చాయని.. ఇక ఎవరి బెదిరింపులు పనిచేయవని అన్నారు. పరిస్థితి అదుపుతప్పితే సితల్కుచి లాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయని బారానగర్లో నిర్వహించిన బహిరంగ సభలో తేల్చి చెప్పారు.
శనివారం కొందరు దుండగులు కేంద్ర బలగాలపై దాడి చేసి వారి ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడంతో.. భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. అదే రోజు పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఓటరును దుండగులు కాల్చి చంపేశారు.
కాగా, ఈ ఘటనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణమని మమతా బెనర్జీ ఆరోపించారు. వెంటేనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మమతా బెనర్జీ హింసా రాజకీయాలను వీడాలని ప్రధాని నరేంద్ర మోడీ హితవు పలికారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ, టీఎంసీ నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యే పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.