షాక్: కర్ణాటక ప్రభుత్వానికి మైనారిటీ దడ, కాంగ్రెస్ లో అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతంటే !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఏకంకావడంతో ఆ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు అయిన జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీ భయంతో హడలిపోతుంది. అసమ్మతి ఎమ్మెల్యేలు బెంగళూరులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
హైకమాండ్ తో ఢీ
అసమ్మతి ఎమ్మెల్యేల సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించి నేరుగా ఢిల్లీ వెళ్లి హైకమండ్ తో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించారు. రోజురోజుకు అసమ్మతి పెరిగిపోవడంతో సీఎం. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, మంత్రులు హడలిపోతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవి
సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు పలు డిమాండ్లు తెరమీదకు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
తెరమీదకు కులాల లెక్కలు
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని కులాల వారికే అధిక ప్రధాన్యత ఇచ్చారని, అన్ని కులాలను సమానంగా చూడలేదని అసమ్మతి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అన్ని కులాలకు ప్రధాన్యత ఇస్తూ మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముగ్గురు మాజీ మంత్రులు
మాజీ మంత్రి ఎంబి. పాటిల్ ఇంటికి శుక్రవారం ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ అనేక మంది మంత్రులు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు ఎంబి. పాటిల్ తో మాజీ మంత్రులు హెచ్.కే. పాటిల్, సతీష్ జారకిహోళి కలిశారు. వీరందరూ అసమ్మతి ఎమ్మెల్యేలను ఏకం చేసే పనిలో పడ్డారు.
20 మంది రెబల్ ఎమ్మెల్యేలు
మంత్రి పదవులు కేటాయింపు విషయంలో ప్రాంతాలు, కులాల వారిగా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉన్న వారిలో ఎంబి. పాటిల్, హెచ్.కే. పాటిల్, సతీష్ జారకిహోళి, ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ సుధాకర్, బిసి. పాటిల్, ఎన్ఏ హ్యారీస్, ఈశ్వర్ ఖండ్రే, సీఎస్, శివళ్ళి, రఘమూర్తి, రోషన్ బేగ్, హెచ్.ఎం. రేవణ్ణ, సంగమేశ్, తుకారాం, పీటీ. పరమేశ్వర్, బళ్లారి నాగేంద్ర, వి. మునియప్ప,శివరాం హెబ్బార్, భీమా నాయక్, బి. నారాయణ ఉన్నారు.